● తొమ్మిది కిలోల పట్టివేత
నెల్లూరు సిటీ: ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, ఈగల్ పోలీసులు శనివారం నిర్వహించారు. ఈ క్రమంలో రైల్లో అక్రమంగా తరలిస్తున్న రెండు బ్యాగుల్లోని తొమ్మిది కిలోల గంజాయిని పట్టుకున్నారు. నెల్లూరు రైల్వేస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను రైల్వే డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. నెల్లూరు, ఒంగోలు సర్కిల్ పరిధిలోని రైల్వేస్టేషన్లు, రైళ్లలో తనిఖీలను చేపట్టామని తెలిపారు. ఈ తరుణంలో నెల్లూరు – గూడూరు మార్గంలోని రామేశ్వరం వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్లో తనిఖీలను జరిపామని చెప్పారు. అనుమానాస్పదంగా ఉన్న రెండు బ్యాగ్లను పరిశీలించగా, అందులో తొమ్మిది కిలోల గంజాయి లభ్యమైందన్నారు. తనిఖీల నేపథ్యంలో సదరు బ్యాగ్లను వ్యక్తి వదిలి పరారయ్యారని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిరంతరంగా తనిఖీలు
రైల్వేస్టేషన్లు, రైళ్లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా ఉంచుతామని, తనిఖీలను నిరంతరం జరుపుతామని మురళీధర్ తెలిపారు. 1972 నంబర్కు సమాచారమివ్వాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. తొలుత ఈగల్ టీమ్కు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్లను ఆవిష్కరించారు. సీఐ సుధాకర్, ఎస్సైలు హరిచందన, చెన్నకేశవ పాల్గొన్నారు.


