చేజర్ల: పేదలు ఎన్నో సంవత్సరాల క్రితం పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములవి. తాజాగా ఆక్రమణలంటూ అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయడం, ఆగమేఘాల మీద కదిలిన రెవెన్యూ యంత్రాంగం పేదోళ్ల భూముల్లోనే సాగులో ఉన్న నిమ్మ చెట్లను తొలగించారు. ఈ ఘటన రెవెన్యూ అధికారుల దాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తోంది. మండలంలోని బిల్లుపాడులో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బిల్లుపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పలువురు నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన అనాధీన భూముల్లో మెట్ట పైర్లు వరి, నిమ్మచెట్లు సాగు చేసుకుంటున్నారు. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూములు ఆక్రమించారంటూ రెవెన్యూ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. వెంటనే రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ బందోబస్తుతో వచ్చారు. సాగులో ఉన్న నిమ్మచెట్లను జేసీబీతో తొలగించారు. ఇందులో అధికార పార్టీకి చెందిన వారి భూముల జోలికి వెళ్లలేదు. వైఎస్సార్సీపీ మద్దతుదారుల చెట్లను తొలగించారు. గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ కొంతమేర జరిగినా ఎన్నో ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న రైతుల విషయంలో అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించి చెట్లను ధ్వంసం చేయడంపై బాధితులు లబోదిబోమంటున్నారు. అధికార పార్టీకి చెందినవారు పొలాలను ఆక్రమించారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు. జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై చేజర్ల తహసీల్దార్ మస్తానయ్యను వివరణ కోరగా పట్టా భూములు జోలికి వెళ్లలేదని, ఆక్రమణ గురైన వాటిపై ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నామన్నారు.
అధికార పార్టీ నేతలు చెప్పారని..
బిల్లుపాడులో రెవెన్యూ
అధికారుల దాష్టీకం
బాధితులు వైఎస్సార్సీపీ
వర్గీయులు కావడంతోనే..


