నెల్లూరు(అర్బన్): ఓ గర్భిణికి అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి మగబిడ్డను బతికించినట్లు కిమ్స్ సూపర్ స్పెషాలిటీ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీదుర్గ తెలిపారు. గురువారం నెల్లూరు దర్గామిట్టలోని ఆస్పత్రిలో వివరాలు వెల్లడించారు. నగరంలోని తస్మిన్ 6.3 నెలల గర్భంతో ఉంది. నెలలు నిండక ముందే ఫిట్స్ వచ్చాయి. భర్త జునైద్ ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి స్పృహలో లేదు. హైబీపీ ఉన్నట్లు గుర్తించారు. ఆమె తలలో మెదడు వాపునకు గురైంది. బిడ్డను స్కానింగ్లో పరీక్షించగా హార్ట్బీట్ తగ్గిపోయింది. బరువు కూడా కేవలం 1.2 కిలోలు మాత్రమే ఉంది. అత్యవసరంగా తల్లికి ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. బిడ్డకు శ్వాసకోశ సమస్య అయిన రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వచ్చింది. ఫీడ్ ఇంటోలరెన్స్, సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా, సెప్సిస్ వంటి క్లిష్ట పరిస్థితులకు చికిత్స అందించారు. పీడియాట్రిక్ డాక్టర్ల బృందంతో కలిసి ఎన్ఐసీయూలో ఉంచి అత్యాధునిక చికిత్స చేశారు. దీంతో బిడ్డ ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుంది. బరువు 1.6 కిలోలకు చేరుకుంది. క్లిష్టతరమైన కేసులకు కిమ్స్లో వైద్యసేవలు అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడినందుకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి లక్ష్మీప్రియ వైద్యులను అభినందించారు. కార్యక్రమంలో నియోనేటాలజిస్ట్లు డాక్టర్ భార్గవ్, డాక్టర్ నవీన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మురార్జి, పీడియాట్రిషియన్ డాక్టర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
గోదాములో అగ్నిప్రమాదం
● రూ.40 లక్షల ఆస్తి నష్టం
తోటపల్లిగూడూరు(పొదలకూరు): మండలంలోని తోటపల్లి గ్రామంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో హైరర్స్ గోదా ము పూర్తిగా దగ్ధ మై భారీ నష్టం సంభవించింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నరసింహారావు చాలా ఏళ్లుగా హైరర్స్ను నిర్వహిస్తున్నాడు. విద్యుత్ సర్వీస్ లైన్ తెగిపోవడంతో నిప్పురవ్వలు గోదాముపై పడి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. షామియానాలు ఉండటంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించి సామగ్రి మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు నరసింహారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా హైరర్స్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, అగ్నిప్రమాదంతో జీవనాధారం కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.


