సంగం: నెల్లూరుకు చెందిన జ్యోతి అనే మహిళ సంగంలో తన బంగారు తాళిబొట్టు సరుడు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేరకు.. బుజబుజనెల్లూరులో నివాసముంటున్న మన్నూరు జ్యోతి నర్సుగా విధులు నిర్వహిస్తోంది. బ్యాంక్ పని నిమిత్తం స్వగ్రామమైన పొదలకూరు మండలం మహ్మదాపురం వెళ్లాలనుకుంది. తన పక్కింట్లో ఉంటున్న ఆటో డ్రైవర్ గౌతమ్నంద ఏఎస్పేట మండలం కొండమీదకొండూరుకు వెళ్తున్నాడు. సోమవారం ఆమె అతడి ఆటో ఎక్కింది. సంగం నాలుగు రోడ్ల సెంటర్లో దిగిన జ్యోతి మరో ఆటోలో సంగం శివాలయానికి చేరుకుంది. అక్కడ్నుంచి మహ్మదాపురం వెళ్లేందుకు పొదలకూరు బస్సు ఎక్కింది. బస్సు కదిలి బ్యారేజ్ మీదకు వెళ్లే సరికి తన మెడలో 13 సవర్ల బంగారు తాళిబొట్టు సరుడు కనిపించలేదు. దీంతో కంగారుపడిన జ్యోతి సాయంత్రం వరకు బ్యారేజ్, అక్కడి నుంచి నాలుగు రోడ్ల సెంటర్కు వెళ్లి వెతికింది. అయినా ఫలితం లేకపోవడంతో సంగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై రాజేష్ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


