నడిచి వెళ్తుండగా..
● మహిళ వద్ద రూ.లక్ష నగదు,
సెల్ఫోన్ అపహరణ
వెంకటాచలం: బ్యాంక్ నుంచి నగదు తీసుకుని వెళ్తున్న మహిళ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మోటార్ బైక్పై వచ్చి రూ.లక్ష నగదు, సెల్ఫోన్ లాక్కొని పరారైన ఘటన మండల కేంద్రమైన వెంకటాచలంలో శనివారం జరిగింది. చెముడుగుంట గ్రామానికి చెందిన సుకన్య శనివారం స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి, రూ.లక్ష నగదు తీసుకుని కాలినడకన కసుమూరు క్రాస్రోడ్డు వద్దకు వెళ్తుండగా, మోటార్ బైక్పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి సెల్ఫోన్ను, రూ.లక్ష నగదును లాక్కొన్నాడు. దీంతో మహిళ పెద్దగా కేకలు వేసే లోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి బైక్పై పరారయ్యాడు. బాధితురాలు వెంకటాచలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కార్పొరేట్కు
కీలుబొమ్మల్లా బ్యాంక్లు
కావలి (అల్లూరు): దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారిందని, పేదలకు అందాల్సిన రుణాలు బడా బాబులకు మళ్లిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ధ్వజమెత్తారు. కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్లో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను విద్యనభ్యసించిన జవహర్ భారతి కళాశాల ప్రస్తుతం ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్లు సక్రమంగా రాకపోవడం వల్ల వెనుకబడిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.14.30 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరించేలా కావలిలో ఆరుగురు జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రైలు దిగిన
వృద్ధురాలి అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై నెల్లూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన పి.బాలమ్మ గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక బాధపడుతోంది. ఆమె కుమారుడు చైన్నెలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 1వ తేదీ చైన్నెలోని కుమారుడిని చూసేందుకు ఆమె తన తమ్ముడు నరసింగరావుతో కలిసి చైన్నె ఎక్స్ప్రెస్లో బయలుదేరింది. 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైలు నెల్లూరుకు చేరుకుంది. తమ్ముడు నిద్రలో ఉండగా బాలమ్మ రైలు దిగి ఎటో వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత నిద్ర నుంచి లేచిన నరసింగరావు తన అక్క కనిపించకపోవడంతో బోగి అంతా గాలించాడు. జాడ తెలియరాలేదు. ఈ మేరకు ఆయన శనివారం నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై హరిచందన వృద్ధురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 94406 27644, 99664 16581 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
5,500 లీటర్ల డీజిల్ సీజ్
● మూడు వాహనాల స్వాధీనం
నెల్లూరు సిటీ: గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా డీజిల్ తరలింపుపై విజలెన్స్ అధికారులు శనివారం దాడులు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రూరల్ పరిధిలోని అల్లీపురం గ్రామంలో భగవాన్ వెంకయ్య స్వామి లేఅవుట్కు సమీపంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి డీజిల్ను దిగుమతి చేసుకుంటున్నారు. బిల్లులు, లైసెన్స్ లేకుండా విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. అందులో భాగంగా మూడు వాహనాల నుంచి రూ.17.38 లక్షలు విలువ చేసే 5,500 లీటర్ల ఆయల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను సీజ్ చేసి 6–ఏ కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీహరి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
కావలి(అల్లూరు): కావలి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడిని రైలు ఢీకొని మృతిచెందారు. రైల్వే ఎస్సై వెంకట్రావ్ వివరాల మేరకు.. ఓ వృద్ధుడు ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చనిపోయారు. మృతుడు తెల్లరంగు చొక్కా, గ్రీన్ కలర్ లుంగీ ధరించి ఉన్నారు. మృతుడి జేబులో తూర్పు ఎర్రబెల్లి నుంచి కావలికి వచ్చిన బస్ టికెట్ ఉందని, మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పోలీస్ అదుపులో నిందితుడు?
ఉదయగిరి: సీతారామపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి పేరిట మోసం చేసిన అఖిల్ అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారించి ఒకట్రెండు రోజుల్లో కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
నడిచి వెళ్తుండగా..
నడిచి వెళ్తుండగా..


