కూటమి వచ్చి.. మోసం చేసి.. | - | Sakshi
Sakshi News home page

కూటమి వచ్చి.. మోసం చేసి..

Aug 21 2025 9:26 AM | Updated on Aug 21 2025 9:26 AM

కూటమి

కూటమి వచ్చి.. మోసం చేసి..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.10 వేలు

వరుసగా ఐదేళ్లు అకౌంట్‌లో జమ

కూటమి వస్తే ఏటా

రూ.15 వేలిస్తామని హామీ

రెండో ఏడాది వచ్చినా ఆ ఊసే లేదు

ఇప్పటికే పోలీసు, రవాణా

అధికారుల కేసులతో సతమతం

ఈఎంఐలు చెల్లించలేక

ఇబ్బందుల పాలు

ఆటోల్లో ప్రయాణించేది ఎక్కువ

మంది మహిళలే

వారంతా ఉచిత బస్సుల్లో ప్రయాణం

ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. హామీ నెరవేర్చకుండా ఫ్రీ బస్సు పధకం అమలు చేయడం సరికాదు. ఇప్పటికే మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పోలీసు, రవాణా కేసులుతో ఆటోలను తిప్పలేని పరిస్ధితి. ఇప్పుడు ఉచిత బస్సు పధకం అమలు చేసి మమ్మల్ని మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నారు.

– కోలగట్ల సురేష్‌, జిల్లా అధ్యక్షుడు, ఆటో కార్మిక సంఘం

నెలకు రూ.4వేలు ఫించన్‌ ఇవ్వాలి

ప్రతి ఆటో కార్మికుడి కుటుంబానికి నెలకు రూ.4 వేలు పింఛన్‌ ఇవ్వాలి. జీఓ నం. 21తో ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ కట్టలేక అప్పులు చేసి మరి ఆటోలు తిప్పుతున్నారు. గత ప్రభుత్వం ప్రతి ఆటో కార్మికునికి రూ.10 వేలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినా నేటికి ఆ ఊసే లేదు. ఇప్పటికై నా హామీని నెరవేర్చాలి.

– మారుబోయిన రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆటో కార్మిక సంఘం

జీవనం గందరగోళం

ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో కార్మికుల జీవనం మరింత దుర్భరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు ఎక్కేది ఎక్కువగా మహిళలే. ఇప్పుడు వారంతో బస్సుకు పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆటోలను అమ్ముకోవాల్సిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చి ఆటో కార్మికును ఆదుకోవాలి.

– దేవతాటి లవణకుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు, ఆటో కార్మిక సంఘం

ఉచిత బస్సు

చంద్రబాబు మోసానికి గురైన వారి జాబితాలో ఆటోడ్రైవర్లు చేరారు. గతంలో వీరికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘వాహన మిత్ర’ పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తే.. కూటమి అధికారంలోకి వస్తే అంతకుమించి ఏటా రూ.15 వేలిస్తామని హామీలిచ్చి వెన్నుపోటు పొడిచింది. మరో వైపు సరైన బాడుగలు లేక నెలనెలా ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించలేక సతమతమవుతున్నారు. ఈ తరుణంలో సకాలంలో ఫిట్‌నెస్‌, ఇన్స్యూరెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్లు చేయించలేదంటూ పోలీసులు, రవాణాశాఖాధికారులు రాసే కేసులు, వేసే జరిమానాలకు అల్లాడిపోతున్నారు. గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లుగా తాజాగా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడంతో కనీసం రోజు వారి ఆయిల్‌ ఖర్చులు కూడా రావడం లేదని గొల్లుమంటున్నారు.

నెల్లూరు (టౌన్‌): ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చింది’ సామెత చందానా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో ఆటో డ్రైవర్ల బతుకును దెబ్బ తీసింది. జిల్లాలో ఉద్యోగం, ఉపాధి అవకాశా లు లేకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఫైనాన్స్‌ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఆటోలు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు. మరికొందరు ఆటోలను రోజువారి అద్దెకు తీసుకుని తిప్పుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాలక్రమంలో ఆటోల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో ఆటో డ్రైవర్లకు రాబడి తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆటోలకు ఫిట్‌నెస్‌, ఇన్స్యూరెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్లు కోసం ఆటో యజమానులు అప్పులు పాలవుతున్నారని గుర్తించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వాహనమిత్ర పథకం అమలు చేశారు.

ఉచిత బస్సులతో ఆటో కార్మికుల తప్పని ఉరి

రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రవేశ పెట్టిన సీ్త్రశక్తి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం)తో ఆటో కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటి వరకు ఎక్కువ మంది మహిళలు ఆటోల్లో ప్రయాణించే వారని ఇప్పడు, ఉచిత బస్సుతో ఆటోల్లో ఎక్కే వారు లేకపోవడంతో వారి జీవనం గగనంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసి మమ్మల్ని రోడ్ల పాల్జేశారని ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 40 వేలకు పైగా ఆటోలు

జిల్లాలో 40 వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. 40 వేల కుటుంబాలు ఆటోలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. డిగ్రీ, పీజీ చేసిన వారు సైతం ఉద్యోగాలు రాక ఆటోలను కొనుగోలు చేసి వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.ఫైనాన్స్‌ల్లో రుణం తీసుకుని ఆటోలను కొనుగోలు చేసి వాటి మీద వచ్చే ఆదాయంలో కొంత మొత్తాని నెలవారీ వాయిదా చెల్లిస్తున్న పరిస్థితి. సీ్త్ర శక్తి పథకం అమలుతో ఆటోల్లో ఎక్కే వారు లేక ఆయా స్టాండ్‌ల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల రూట్లలో తిరిగే ఆటో కార్మికులు అక్కడ ప్రయాణించే వారు లేక పోవడంతా వారంతా పట్టణాలు, నగరాల్లో వచ్చేస్తుండటంతో రోజు రూ.200 నుంచి రూ.300లు కూడా సంపాదన లేదని ఆవేదన వక్తం చేస్తున్నారు. దీంతో ఆటోలను అమ్ముకోవాల్సిన పరిస్ధితి ఏర్పడిందని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆటోలపై ఆధారపడే నిరుద్యోగులకు ఏటా రూ.25 వేలు ఆర్థిక సాయం అందించాలని డియాండ్‌ చేస్తున్నారు.

వాహన మిత్రతో భరోసా

కూటమి అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఇచ్చిన వాహనమిత్ర పథకం సాయం కంటే మిన్నగా రూ.15 వేలు ఇస్తామని హామీలు గుప్పించింది. గతేడాది ఈ సాయం ఎగనామం పెట్టారు. ఈ ఏడాది ప్రారంభమైనా ఇంత వరకు ఆ ఊసే లేదు. సరైన బాడుగులు లేక.. రాబడి లేక నెల నెలా ఆటోలకు ఫైనాన్స్‌ బకాయిలు చెల్లించలేకపోతుంటే.. మరో వైపు సకాలంలో ఫిట్‌నెస్‌, ఇన్స్యూరెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికే పోలీసు, రవాణా శాఖ అధికారుల నమోదు చేస్తున్న కేసులతో సతమతవుతున్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి ఏటా అందజేసి వాహనమిత్ర పధకం ఆటో కార్మికుల్లో భరోసా నింపిందని ఆటో కార్మికులు చెబుతున్నారు. వాహన మిత్ర పథకంలో భాగంగా అందజేసే రూ. 10 వేలతో ఆటోకు సంబంధించి ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, త్రైమాసిక పన్నును క్రమం తప్పకుండా చెల్లించుకుంటున్నామంటున్నారు. దీంతో పోలీసు, రవాణా కేసులు బాధ కూడా తగ్గిపోయింది. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా 5 ఏళ్లు వాహన మిత్ర పథకాన్ని అమలు చేశారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఆటో కార్మికుడుకు రూ. 10 వేలు నగదును వారి ఆకౌంట్లలో జమ చేయడంతోపాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి.

కూటమి వచ్చి.. మోసం చేసి.. 
1
1/3

కూటమి వచ్చి.. మోసం చేసి..

కూటమి వచ్చి.. మోసం చేసి.. 
2
2/3

కూటమి వచ్చి.. మోసం చేసి..

కూటమి వచ్చి.. మోసం చేసి.. 
3
3/3

కూటమి వచ్చి.. మోసం చేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement