రోడ్డెక్కితే.. చలాన్ వాతే | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కితే.. చలాన్ వాతే

Aug 13 2025 7:19 AM | Updated on Aug 13 2025 6:41 PM

రూ.2.35 కోట్లకు పైగానే చెల్లించిన వాహనచోదకులు

జిల్లాలో లక్ష వరకు డెలివరీ కాని కార్డులు

డిజిటల్‌గా చూపించినా కేసుల నమోదు

గత ప్రభుత్వంలో కార్డుల భారం లేకుండా డిజిటల్‌ విధానానికి ప్రాధాన్యత

యాప్‌లో కార్డు చూపిస్తే రైట్‌రైట్‌

రోడ్డెక్కిన వాహనదారులను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం మాస్టర్‌ స్కెచ్‌ వేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డుల పేరుతో రూ.కోట్లను ఖజానాలో వేసుకుంది. కార్డులు జారీ చేయకుండా చలాన్‌ పేరుతో రూ.కోట్ల దోపిడీ చేస్తోంది. డిజిటల్‌ టెక్నాలజీకి తానే ఆధ్యుడనని చెప్పుకునే సీఎం చంద్రబాబు, తిరిగి ఫిజికల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వాహనదారులకు కార్డుల భారం లేకుండా డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫిజికల్ గా కార్డు లేకపోయినా .. యాప్ ఓపెన్ చేసి చూపించినా సరిపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చి దోపిడీకి తెర తీసింది. ఒక వైపు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మరో వైపు చలానాలు రాస్తూ వాహనచోదకుల జేబులకు చిల్లు పెడుతోంది.

నెల్లూరు(టౌన్‌): డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డుల విషయంలో వాహనదారుల పరిస్థితి సంకటంగా మా రింది. కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా జారీ చేయని పరిస్థితి. రవాణాశాఖలో సేవలు సులభతరం చేశామని, కార్యాలయానికి రా కుండానే అన్ని సేవలు మీ ముంగిట పొందవచ్చని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్‌, ఆర్సీ కార్డుల కోసం రవాణా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటుంది. వాహనం రోడ్డు ఎక్కితే చాలు లైసెన్స్‌, ఆర్సీలు చూపించమని అటు రవాణా శాఖాధికారు లు, ఇటు పోలీసు అధికారులు దబాయిస్తున్నారు. కార్డుల కోసం డబ్బులు చెల్లించామని, కార్డులు ఇంకా ఇవ్వలేదని చెప్పినా.. చలానా రాసి చేతిలో పెడుతున్నారు. కొంత మంది వ్యాలెట్‌ యాప్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న కార్డును చూపితే అది ఒరిజనల్‌ లేక డూప్లికేటా మాకు తెలియదు కార్డు ఉంటే చూపించు వదిలివేస్తామని చెబుతున్నారు.

కార్డుల భారం తగ్గించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

జిల్లాలో నెల్లూరు ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంతోపాటు ఆత్మకూరు, కావలి, కందుకూరుల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా సగటున 500కు పైగా వాహన రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్‌ లైసెన్స్‌లు జారీ చేస్తుంటారు. ఫిజికల్‌ కార్డుల కోసం ప్రభుత్వాలు అదనంగా ప్రతి కార్డుకు రూ.235 వసూలు చేసేవి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాహనదారులపై కార్డుల భారం తొలిగించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డులను సెల్‌ఫోన్‌లో వ్యాలెట్‌ యాప్‌లో అందుబాటులో ఉంచింది. పోలీసు, రవాణా అధికారులకు అడిగినప్పుడు సేవ్‌ చేసుకున్న కార్డు చూపిస్తే సరిపోతుంది. పొరపాటున కార్డు మరిచిపోతే వాహనచోదకులపై చలాన్‌లు రాసే పరిస్థితి ఉండడంతో ఈ విధానానికి స్వస్తి పలికింది. డిజిటల్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

వాహనదారులపై అధికారుల వేధింపులు

వాహనం రోడ్డు ఎక్కితే చాలు పోలీసు, రవాణా అధికారులు తనిఖీ సమయంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డులు చూపించమని వేధింపులు ఎక్కువయ్యాయంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డులకు డబ్బులు చెల్లించినా డౌన్‌లోడ్‌ చేసుకున్న కార్డు చూపిస్తే సరిపోతుందనే ప్రభుత్వ మార్గదర్శకాలు ఎక్కడా లేకపోవడంతో ఫిజికల్‌ కార్డులు చూపించాలని, లేదంటే కేసులు, చలాన్‌ రాస్తామని చెబుతున్నారు. కొంత మంది అధికారులు వాహనదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్న కార్డులు చూపిస్తే మిన్నకుంటున్నారు. ఎక్కువ మంది అధికారులు ఫైన్‌ విధిస్తుండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికై నా కార్డు లు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉంది. కనీసం సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డులు చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. కార్డులను త్వరగా ముద్రించి వాహనదారులకు అందజేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

డీఎల్‌, ఆర్సీ కార్డుల పేరుతో ఖజానాకు ‘రూ.కోట్ల’

లైసెన్స్‌, ఆర్సీ కార్డుకు రూ.235 చెల్లింపు

డిజిటల్‌ టెక్నాలజీకి తానే ఆధ్యుడనని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన డిజిటల్‌ విధానాన్ని స్వస్తి పలికడమే కాకుండా వాహనదారులను దోచుకుంటున్నారు. గతేడాది నవంబరు నుంచి మళ్లీ కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించుకోవడం ప్రారంభించారు. లైసెన్స్‌ జారీ, రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రభుత్వ చలానాతో పాటు కార్డుకు ప్రత్యేకంగా రూ.235 వసూళ్లు చేస్తున్నారు. గతేడాది నవంబరు నుంచి డబ్బులు చెల్లించినా వాహనదారులకు ఇంత వరకు కార్డులు అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షకు పైగా లైసెన్స్‌, ఆర్సీ కార్డులు రావాల్సి ఉందని రవాణా అధికారులు చెబుతున్నారు. దాదాపు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్టుల కోసం రూ.2.35 కోట్లకు పైగా డబ్బులు చెల్లించారు. ఇదంతా వాహనదారులను దోపిడీ చేసేందుకు ప్రభుత్వం మాస్టర్‌ స్కెచ్‌ వేసినట్లు అర్థమవుతోంది. కార్డుల విషయంలో నేటికి రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు. కార్డుల ముద్రణ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా లేదా ఏదైనా సంస్థకు అప్పజెప్పాలా అనే సందిగ్ధంతలో ఉంది. కార్డులు ఎప్పుడు ముద్రిస్తారా మాకు ఎప్పుడు వస్తాయో అంటూ వాహనదారులు మండిపడుతున్నారు.

కార్డులు ఇంకా రాలేదు

డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డులు ఇంకా రాలేదు. కార్డులను ముద్రించాల్సి ఉంది. త్వరలోనే వాటిని ముద్రించి ఆయా జిల్లాలకు పంపుతారు. కార్డులు వచ్చిన వెంటనే వాహనదారులు ఇచ్చిన అడ్రస్‌కు వారి ఇళ్లకే పంపుతాం. కార్డుల కోసం రవాణా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. – చందర్‌, డీటీసీ, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement