Andhra Pradesh: ARSI Body Exhumed After First Wife Files Complaint - Sakshi
Sakshi News home page

మొదటి భార్య ఫిర్యాదు ఏఆర్‌ ఎస్సై మృతదేహం వెలికితీత 

Jul 26 2023 11:10 AM | Updated on Jul 26 2023 3:22 PM

మోహన్‌ మృతదేహాన్ని వెలికి తీయిస్తున్న పోలీసులు  - Sakshi

మోహన్‌ మృతదేహాన్ని వెలికి తీయిస్తున్న పోలీసులు

  నెల్లూరు: తిరుపతి జిల్లాలో ఏఆర్‌ ఎస్సైగా పనిచేస్తున్న త్రిపురాంతకం మోహన్‌ (56) ఈనెల 13వ తేదీన మృతిచెందగా రెండో భార్య కుటుంబసభ్యులు పూడ్చిపెట్టారు. అయితే మొదటి భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం పూడ్చిన మృతదేహాన్ని వెలికితీయించినట్లు ఎస్సై ఆవుల వెంకటేశ్వర్లు చెప్పారు. అందిన వివరాల మేరకు.. నెల్లూరులోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న మోహన్‌ తిరుపతి జిల్లాలో ఏఆర్‌ ఎస్సైగా పని చేస్తున్నాడు.

మోహన్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. నెల్లూరులో మొదటి భార్య, లింగసముద్రం మండలం వీఆర్‌ కోట గ్రామంలో రెండో భార్య నివాసం ఉంటున్నారు. ఈనెల 9న మోహన్‌ తన రెండో భార్య కందుకూరి పద్మావతి ఇంటికి వచ్చాడు. 13న ఆయన మృతిచెందగా మొదటి భార్య మాధవికి తెలియకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. భర్త ఇంటికి రాకపోవడం.. ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలియక పోవడంతో ఆరా తీయగా వీఆర్‌ కోటలో రెండో భార్య వద్ద మృతి చెందినట్లు తెలుసుకున్నారు.

ఈ విషయమై లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌లో మొదటి భార్య కుమారుడు రిత్విక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. వీఆర్‌కోటలో తహసీల్దార్‌ మీరావలీ, నెల్లూరు మెడికల్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు సమక్షంలో మంగళవారం పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిర్వహించినట్లు ఎస్సై వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement