టీడీపీ నేత బరితెగింపు
● దళితుడి భూమిని ఆక్రమించేందుకు యత్నం
● సాగులో ఉన్న జామాయిల్ నరికివేత
మర్రిపాడు: అధికార మదంతో గ్రామస్థాయిలో చోటా నేతలు కూడా రెచ్చిపోతున్నారు. ఏళ్లుగా సాగులో ఉన్న భూముల్లో పంటను ధ్వంసం చేసి ఆక్రమించేందుకు యత్నించిన ఘటన నాగినేనిగుంటలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నాగినేనిగుంట గ్రామంలో కాలేపల్లి రామయ్య అనే దళితుడికి మూడు దశాబ్దాల క్రితం సర్వే నంబర్ 288/1లో మూడెకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయన ఎన్నో సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గతంలో గ్రామానికి చెందిన టీడీపీ చోటా నేత గిద్దలూరు జిలానీ కన్ను ఆ భూమిపై పడింది. అధికారం ఉంది కదా అని అందులో సాగులో ఉన్న జామాయిల్ మొక్కలను సైతం నరికివేసి ఆ పొలం తనదంటూ రైతును బెదిరించడం మొదలుపెట్టాడు. దీనిపై అప్పట్లో పలువురు పెద్దలు, గ్రామానికి చెందిన వారు సర్ది చెప్పడంతో కొంత వెనక్కు తగ్గిన జిలానీ మళ్లీ రెండు రోజుల క్రితం రామయ్య పొలంలోని మొక్కలను మరోసారి నరికేశాడు. ఇదేమని ప్రశ్నిస్తే పొలంలోకి వస్తే నిన్ను కూడా నరుకుతా అంటూ జిలానీ బెదిరించినట్లు రామయ్య తెలిపారు. దీనిపై తాము గతంలోనే పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మళ్లీ తమ భూమిలోని మొక్కలను నరికివేసి నష్టం కలిగించారని, ఇప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. జిల్లా ఉన్నతాధికారులైనా చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
నాగినేనిగుంట సర్వే నంబర్ 288 పూర్తి విస్తీర్ణం 10 ఎకరాలు ఉంది. ఇందులో గతంలో ఆరుగురికి పట్టాలు మంజూరు చేశారు. హద్దులు చూపలేదు. దీనిపై రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– అనిల్కుమార్ యాదవ్, తహసీల్దార్


