
నెల్లూరు(క్రైమ్): విశాఖపట్నం కిడ్నీ రాకెట్ కేసు విచారణలో భాగంగా అక్కడి పోలీసు ప్రత్యేక బృందం సోమవారం నెల్లూరుకు వచ్చింది. నెల్లూరు మినీబైపాస్రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడికి ఆ కేసుతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బాలాజీనగర్ పోలీసుల సహకారంతో సదరు వైద్యుడి ఆస్పత్రికి చేరుకున్నారు.
మొదట సదరు వైద్యుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని అక్కడి సిబ్బంది చెప్పడంతో కొన్ని గంటలపాటు పోలీసు సిబ్బంది అక్కడే వేచిచూశారు. ఎంత సేపటికి వైద్యుడు బయటకు రాకపోవడంతో పోలీసులు ఆస్పత్రిలోకి ప్రవేశించి వైద్యుడి కోసం గాలించగా కనిపించలేదు. దీంతో పోలీసులు అతని కోసం గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో విశాఖపట్నం పోలీసులు వెనుదిరిగారు. ఈ విషయం నగరంలో చర్చనీయాంశంగా మారింది.