
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్కు చేదు అనుభవమే మిగిలింది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ఈ జట్టు.. ఈసారి మాత్రం దారుణ వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా బుధవారం నాటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతి (CSK vs PBKS)లో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సీఎస్కే నాయకత్వ బృంద తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో స్వీయ తప్పిదంతో ఓటమిని కొని తెచ్చుకున్నారని విమర్శించాడు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ను ఆడించకుండా తప్పు చేశారని భజ్జీ పేర్కొన్నాడు.
రూ. 10 కోట్లు ఇచ్చి.. బెంచ్ మీద కూర్చోబెడతారా?
‘‘పరిస్థితులకు తగ్గట్లుగా చెన్నై తమ జట్టును ఎంపిక చేసిందని ఎంతమాత్రమూ అనిపించలేదు. నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా.. ఈ ముగ్గురిని కలిపి గనుక ఈ మ్యాచ్లో ఆడిస్తే సీఎస్కే కచ్చితంగా మ్యాచ్ గెలిచేది.
రూ. 10 కోట్లు పెట్టి అశ్విన్ను కొని.. అతడిని బెంచ్కే పరిమితం చేస్తున్నారు. ఈమాత్రం దానికి అంత ధర పెట్టాల్సిన అవసరం ఏమిటి?.. అతడిని ఎందుకు పక్కన పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. బహుశా ఎవరితోనైనా అతడు గొడవపడ్డాడేమో!’’ అని హర్భజన్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు.
రూ. 9.75 కోట్లకు కొనుగోలు
కాగా గతేడాది రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్.. ఈ ఏడాది తన సొంతగూటికి తిరిగి వచ్చేశాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ దిగ్గజ స్పిన్నర్ను సీఎస్కే రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే, అశూ సేవలను మాత్రం సీఎస్కే ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు. ఇప్పటి వరకు జట్టు పది మ్యాచ్లు ఆడగా ఇందులో మూడింటిలో అతడిని పక్కనపెట్టారు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు అశూ ఆడిన ఏడు మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తీయగలిగాడు.
చహల్ హ్యాట్రిక్
ఇక పంజాబ్తో మ్యాచ్ విషయానికొస్తే.. సొంత మైదానం చెపాక్లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. 19.2 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పంజాబ్ యువ స్పిన్నర్ హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా నాలుగు వికెట్లతో మెరిసి చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
మరో స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ ఒక వికెట్ తీయగా.. పేసర్లలో అర్ష్దీప్ సింగ్, మార్కో యాన్సెన్ తలా రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఇక చెన్నై విధించిన లక్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (36 బంతుల్లో 54), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 72) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్లు మతీశ పతిరణ, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు కూల్చారు.
చదవండి: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ మొత్తానికి అతడు దూరం