సెమీస్‌లో యూపీ యోధాస్, పట్నా పైరేట్స్‌ | UP Yoddhas and Patna Pirates in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో యూపీ యోధాస్, పట్నా పైరేట్స్‌

Dec 27 2024 4:02 AM | Updated on Dec 27 2024 4:02 AM

UP Yoddhas and Patna Pirates in the semis

ఎలిమినేటర్‌ మ్యాచ్‌ల్లో ఓడిన మాజీ చాంపియన్స్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్, యు ముంబా

పుణే: గత ఏడాది ప్రొ కబడ్డీ లీగ్‌లో 11వ స్థానంతో సరిపెట్టుకున్న యూపీ యోధాస్‌ ఈసారి మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 46–18 పాయింట్ల తేడా మాజీ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టును చిత్తుగా ఓడించింది. రెయిడర్‌ భవానీ రాజ్‌పుత్‌ 12 పాయింట్లతో మెరిసి యూపీ యోధాస్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. హితేశ్‌ 6 పాయింట్లు రాబట్టగా... గగన్‌ గౌడ, సుమిత్‌ 5 పాయింట్ల చొప్పున సాధించారు. 

భవానీ రాజ్‌పుత్‌ 14 సార్లు రెయిడింగ్‌కు వెళ్లాడు. 9 సార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. రెండుసార్లు దొరికిపోగా, మూడుసార్లు పాయింట్‌ సాధించకుండానే వెనక్కి వచ్చాడు. మరోవైపు పింక్‌ పాంథర్స్‌ జట్టు సమష్టిగా విఫలమైంది. ఆ జట్టు రెయిడర్లుగానీ, డిఫెండర్లుగానీ ఆకట్టుకోలేకపోయారు. డిఫెండర్‌ రెజా మీర్‌బాఘేరి ఐదు పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. 

భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ అర్జున్‌ దేశ్వాల్‌ కేవలం రెండు రెయిడింగ్‌ పాయింట్లు సాధించి నిరాశపరిచాడు. రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ 31–23 పాయింట్ల తేడాతో మాజీ విజేత యు ముంబా జట్టును ఓడించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 

పట్నా పైరేట్స్‌ స్టార్‌ రెయిడర్లు దేవాంక్‌ 8 పాయింట్లు, అయాన్‌ 10 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆల్‌రౌండర్‌ గుర్‌దీప్‌ ఐదు పాయింట్లతో రాణించాడు. యు ముంబా తరఫున అమీర్‌ మొహమ్మద్‌ 7 పాయింట్లు... అజిత్‌ చౌహాన్‌ 5 పాయింట్లు సాధించారు.

నేడు జరిగే సెమీఫైనల్స్‌లో హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధాస్‌ (రాత్రి 8 గంటల నుంచి), దబంగ్‌ ఢిల్లీతో పట్నా పైరేట్స్‌ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌–2 చానెల్‌లో, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.   

Advertisement
 
Advertisement
Advertisement