
9 జట్లతో రెండేళ్ల పాటు సాగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ మే 14న ముగిసింది. ఈ సైకిల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఫైనల్స్కు చేరాయి. లార్డ్స్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చి విజేతగా అవతరించింది.
తద్వారా సౌతాఫ్రికా 27 తర్వాత తొలి ఐసీసీ టైటిల్ సాధించింది. ఈ టైటిల్ సౌతాఫ్రికాకు తొలి ప్రపంచ టైటిల్. 1998లో ఆ జట్టు గ్రేమ్ స్మిత్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. తాజాగా ముగిసిన సైకిల్లో సౌతాఫ్రికా విజేతగా ఆవిర్భవించడంతో డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్ జట్లు అవతరించినట్లైంది.
అరంగేట్రం ఎడిషన్ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్ భారత్ను ఓడించి విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్ను చిత్తు చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్కు చేరిన భారత్ తాజాగా ముగిసిన సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ముగిసిన నేపథ్యంలో ఈ ఎడిషన్ అత్యుత్తమ జట్టు ఇదే అంటూ సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత ఎడిషన్లో అత్యుత్తమ ప్రదర్శలు చేసిన ఆటగాళ్లను ఈ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్కు కెప్టెన్గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో టీమిండియా, ఆసీస్ నుంచి తలో ముగ్గురు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా నుంచి ఒక్కొక్కరు చోటు దక్కించుకున్నారు.
ఈ జట్టు ఓపెనర్లుగా టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ ఎంపికయ్యారు. వన్డౌన్లో రూట్, నాలుగో స్థానంలో విలియమ్సన్, ఐదో ప్లేస్లో కమిందు మెండిస్ అవకాశాలు దక్కించుకున్నారు. వికెట్కీపర్గా అలెక్స్ క్యారీ, ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, పేసర్లుగా కమిన్స్, రబాడ, బుమ్రా, స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లయోన్ ఎంపికయ్యారు.
ఛాంపియన్ జట్టు సౌతాఫ్రికా నుంచి ఈ జట్టుకు కేవలం ఒక్కరు మాత్రమే (రబాడ) ఎంపికయ్యారు. ఫాబ్ ఫోర్లో ముఖ్యుడైన విరాట్ కోహ్లి ఇటీవలే టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా ఫాబ్ ఫోర్లోని మరో ఆటగాడు స్టీవ్ స్మిత్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు.
ఈ జట్టులో చోటు దక్కని మరికొంత మంది అర్హులు కూడా ఉన్నారు. ఇంగ్లండ్కు చెందిన హ్యారీ బ్రూక్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య కూడా ఈ జట్టులో చోటు దక్కించుకునేందుకు అర్హులే.
డబ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్..
యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జో రూట్, కేన్ విలియమ్సన్, కమిందు మెండిస్, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్ (కెప్టెన్), కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లయోన్