చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్‌ | WPL 2025: Delhi Capitals Restricted Mumbai Indians For 123 Runs | Sakshi
Sakshi News home page

చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్‌

Feb 28 2025 9:24 PM | Updated on Feb 28 2025 9:24 PM

WPL 2025: Delhi Capitals Restricted Mumbai Indians For 123 Runs

డబ్ల్యూపీఎల్‌-2025లో ఇవాళ (ఫిబ్రవరి 28) ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. జెస్‌ జోనాస్సెన్‌ (4-0-25-3), మిన్నూ మణి (3-0-17-3), శిఖా పాండే (4-1-16-1), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (4-0-21-1) చెలరేగడంతో ముంబై ఇండియన్స్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. 

కనీసం ఒక్కరు కూడా హాఫ్‌ సెంచరీ చేయలేకపోయారు. ముంబై ఇన్నింగ్స్‌లో 22 పరుగులే అత్యధికం. హేలీ మాథ్యూస్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తలో 22 పరుగులు చేశారు. నాట్‌ సీవర్‌ బ్రంట్‌ 18, అమేలియా కెర్‌, అమన్‌జోత్‌ కౌర్‌ తలో 17 పరుగులు (నాటౌట్‌) చేశారు. ఓపెనర్‌ యస్తికా భాటియా 11 పరుగులు చేసింది. సజీవన్‌ సజనా 5, జి కమలిని 1, సంస్కృతి గుప్త 3 పరుగులు చేశారు. జింటమణి కలిత డకౌటైంది. 

ఈ సీజన్‌లో అద్భుత విజయాలతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసింది. బ్యాటర్లెవరూ స్థాయికి తగ్గట్టుగా రాణించలేదు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కు మంచి ఆరంభమే లభించినా.. ఆమె పెద్ద స్కోర్‌ చేయలేకపోయింది. 

విదేశీ ప్లేయర్లు హేలీ మాథ్యూస్‌, నాట్‌ సీవర్‌ ‍బ్రంట్‌, అమేలియా కెర్‌ రెండంకెల స్కోర్లు చేసినా బంతులు వృధా చేశారు. ఈ మ్యాచ్‌లో ముంబై క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్‌కు హర్మన్‌, బ్రంట్‌ల మధ్య నెలకొల్పబడిన 38 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్‌కు అత్యధికం. ఢిల్లీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేశారు. టిటాస్‌ సాధు ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. ఆమె 2 ఓవర్లలో 24 పరుగులిచ్చింది.

కాగా, ముంబై ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. ముంబై తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది. ముంబైతో పోలిస్తే ఢిల్లీ రన్‌రేట్‌ బాగా తక్కువగా ఉంది. ముంబై రన్‌రేట్‌  0.780గా ఉండగా.. ఢిల్లీ రన్‌రేట్‌ మైనస్‌లో (-0.223) ఉంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన ఈ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే చేసింది. ఆర్సీబీ లాగే యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌ తలో 5 మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement