
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's CWC 2025) భారత్కు (Team India) వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్ల్లో (శ్రీలంక, పాకిస్తాన్) గెలిచిన టీమిండియా, ఆతర్వాత వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది.
ఈ రెండు మ్యాచ్ల్లో భారత్ గెలిచే స్థితిలో ఉండి కూడా అవకాశాలు చేజార్చుకుంది. ముఖ్యంగా ఆసీస్తో మ్యాచ్లో భారత్ 330 పరుగులు చేసి కూడా మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది. సౌతాఫ్రికా మ్యాచ్లో ఇంత భారీ స్కోర్ చేయకపోయినా బౌలర్ల వైఫల్యం కారణంగా చేతిలోకి వచ్చిన మ్యాచ్ చేజారింది.
తాజాగా ఆసీస్ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోక ముందే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్ల్లో 5 శాతం కోత విధించారు. నిర్దేశిత సమయంలోగా భారత బౌలర్లు ఓ ఓవర్ వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఈ జరిమానా విధించింది.
ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయని ప్రతి ఓవర్కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్లో 5 శాతం కొత విధిస్తారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ కప్లో భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 19న ఇండోర్లో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.