Women's T20 WC 2023: సెమీఫైనల్స్‌లో ఎవరెవరు తలపడబోతున్నారంటే..?

Who Will Play Whom In Womens T20 World Cup 2023 Semi Finals - Sakshi

8వ మహిళల టీ20 వరల్డ్‌కప్‌ చివరి దశకు చేరింది. గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, భారత్‌ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 23న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్‌-1 టాపర్‌ ఆస్ట్రేలియా.. గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన టీమిండియాతో తలపడనుండగా.. ఫిబ్రవరి 24న జరుగనున్న రెండో సెమీస్‌లో గ్రూప్‌-2 టాపర్‌ ఇంగ్లండ్‌.. గ్రూప్‌-1లో రెం‍డో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 26న కేప్‌టౌన్‌లో జరుగనున్న టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకుంటారు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క ఓటమిని మూటగట్టుకుంది. ఫిబ్రవరి 18న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత అమ్మాయిలు.. ఆ తర్వాత విండీస్‌, ఐర్లాండ్‌ జట్లను ఓడించారు.

మిగతా జట్ల విషయానికొస్తే.. సెమీస్‌లో భారత్‌ ప్రత్యర్ధి ఆసీస్‌.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో (న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, సౌతాఫ్రికా) విజయం సాధించగా.. గ్రూప్‌-2 టాపర్‌ ఇంగ్లండ్‌ కూడా 4కు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయ జట్టుగా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. సఫారీ టీమ్‌.. టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, 2 అపజయాలు మూటగట్టుకుంది.   

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం 8వ ఎడిషన్‌ కొనసాగుతుంది. 2009లో జరిగిన తొలి ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ విజేతగా నిలువగా.. 2010, 2012, 2014 ఎడిషన్లలో ఆసీస్‌ విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ వరల్డ్‌కప్‌లు సాధించింది. మధ్యలో 2016లో వెస్టిండీస్‌ జగజ్జేతగా నిలువగా.. ఆ తర్వాత 2018, 2020 ఎడిషన్లలో ఆసీస్‌ వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ వరల్డ్‌కప్‌లో విజయం సాధిస్తే ఆసీస్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేస్తుంది. 2020 ఎడిషన్‌లో భారత్‌.. ఫైనల్‌కు చేరి ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top