బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెట‌ర్‌.. భార‌త‌ జ‌ట్టులోకి స్వాగ‌తం! | Who Is Shaik Rasheed-Andhra Talent Who Earned Call India-A Team | Sakshi
Sakshi News home page

బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెట‌ర్‌.. భార‌త‌ జ‌ట్టులోకి స్వాగ‌తం!

Jun 6 2026 6:05 PM | Updated on Jun 6 2026 6:47 PM

Who Is Shaik Rasheed-Andhra Talent Who Earned Call India-A Team

శ్రీలంక‌లో జ‌ర‌గ‌నున్న ట్రై సిరీస్ కోసం ఇప్ప‌టికే భార‌త‌-ఏ జ‌ట్టు ఆ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జ‌ట్టులో తెలుగు కుర్రాడు షేక్ ర‌షీద్‌కు చోటు ద‌క్క‌డం ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ధ్రువ్ జురేల్ నేతృత్వంలోని జ‌ట్టులో సాయి సుద‌ర్శ‌న్‌, ప‌డిక్క‌ల్‌, రుతురాజ్, ఆయుష్ బ‌దోని వంటి ఐపీఎల్ స్టార్ ఆట‌గాళ్లు ఉన్నారు. 

2021 అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ టోర్నీ ద్వారా షేక్ ర‌షీద్ తొలిసారి బీసీసీఐ దృష్టిలో ప‌డ్డాడు. జ‌ట్టు టైటిల్ గెల‌వ‌డంలో షేక్ ర‌షీద్ కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత 2022 ఐసీసీ అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌కు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ ఆరంభంలోనే కోవిడ్ బారిన ప‌డ్డాడు. అయితే లీగ్ ద‌శ ఆఖ‌రికి చేరుకున్న క్ర‌మంలో తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన ర‌షీద్ ఆక‌ట్టుకున్నాడు. 

ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీస్‌లో 108 బంతుల్లో 94 ప‌రుగులు సాధించాడు. ఆ త‌ర్వాత ఫైన‌ల్లోనూ కీల‌క హాఫ్ సెంచ‌రీతో మెరిసిన షేక్ ర‌షీద్ టీమిండియా టైటిల్ గెల‌వ‌డంలోనూ స‌హాయ‌ప‌డ్డాడు.

ఎవ‌రీ షేక్ ర‌షీద్‌?
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ ర‌షీద్ క్రికెట్ ప్ర‌యాణం అడ్డంకుల‌తో సాగింది. అత‌డి తండ్రి షేక్ వలీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ కొడుకు ల‌క్ష్యాన్ని నెర‌వేర్చేందుకు క‌ష్ట‌ప‌డ్డాడు. తండ్రి త్యాగంతో ఇవాళ ఇండియా-ఏ జ‌ట్టుకు ఎంపికైన షేక్ ర‌షీద్ త్వ‌ర‌లోనే జాతీయ జ‌ట్టుకు కూడా ఎంపిక‌వ్వాల‌ని కోరుకుందాం. 

అండ‌ర్‌-19 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అత‌డికి గుర్తింపు తెచ్చిన‌ప్ప‌టికీ దేశవాలీ క్రికెట్‌లో రాణించాలంటే రంజీ మ్యాచ్‌లు ఆడ‌డం త‌ప్ప‌నిస‌రి. అందుకే 2022లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున రంజీల్లో అరంగేట్రం చేసిన షేక్ ర‌షీద్ ఓర్పు, టెక్నిక్‌, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడ‌గ‌ల సామ‌ర్థ్యాన్ని అల‌వ‌రుచుకున్నాడు. 2025-26 రంజీ సీజ‌న్‌లో షేక్ ర‌షీద్ అద్భుతంగా రాణించాడు. 

ఈ సీజ‌న్‌లో షేక్‌ర ర‌షీద్ మూడు శ‌త‌కాల‌తో 627 ప‌రుగులు చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 27 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన షేక్ ర‌షీద్ 46 స‌గ‌టుతో 1831 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచ‌రీలు, తొమ్మిది హాఫ్ సెంచ‌రీలున్నాయి. లంక ప‌ర్య‌ట‌న‌లో ముందుగా శ్రీలంక‌, అఫ్గానిస్తాన్‌తో క‌లిసి ఇండియా-ఏ ట్రై వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌ర్వాత‌ రెండు అన‌ధికారిక టెస్టు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్‌ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్‌, ఎన్‌ జగదీశన్‌, అమన్‌ మోఖడే, షేక్‌ రషీద్‌, జీషన్‌ అన్సారీ

ఇండియా-ఏ టూర్‌ ఆఫ్‌ శ్రీలంక షెడ్యూల్‌
జూన్‌ 25- తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)
జులై 2- రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)

చదవండి: గంభీర్ చేతిలో అంతుచిక్క‌ని ప‌దార్థం.. ట్రోల్‌ సరికాదు!

Advertisement
 
Advertisement
Advertisement