భారత్‌తో స్నేహం కావాలి: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్‌! | Bangladesh Signals U Turn On IPL Ban And Seeks Friendly Cricket Relations With India, Read Story For More Details | Sakshi
Sakshi News home page

భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

Mar 23 2026 11:53 AM | Updated on Mar 23 2026 12:15 PM

Want Friendly Relations: Bangladesh Hints U Turn Strict Measure Against IPL

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చిన భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. స్వదేశంలో తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీ ముద్దాడిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

టోర్నీ నుంచి అవుట్‌
మరోవైపు.. భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెంచుకున్న బంగ్లాదేశ్‌.. భద్రతా కారణాలు చూపి భారత్‌లో ఆడేందుకు నిరాకరించింది. తమ వేదికను శ్రీలంకు మార్చాలని కోరగా.. ఐసీసీ అందుకు అంగీకరించలేదు. ఫలితంగా బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి తప్పుకొంది.

ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం
ఐపీఎల్‌-2026 నుంచి తమ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తప్పించిన తర్వాతే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఈ మేరకు కుంటిసాకులతో ఐసీసీ టోర్నీ నుంచి వైదొలిగింది. అంతేకాదు తమ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం విధిస్తున్నట్లు యూనస్‌ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ఒకానొక సందర్భంలో ప్రకటించింది కూడా!!

అయితే, బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం భారత్‌తో క్రికెట్‌ సంబంధాలు పునరుద్ధరించుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐపీఎల్‌ ప్రసారాల విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బంగ్లాదేశ్‌ క్రీడా శాఖా మంత్రి అమినుల్‌ హక్‌ క్రిక్‌బజ్‌తో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌తో స్నేహం కావాలి
‘‘బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాల గురించి మేము ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. అయితే, రంజాన్‌ ముగిసిన వెంటనే క్రికెట్‌ బోర్డుతో ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతాము. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాము.

ఇండియాతో స్నేహ పూర్వక సంబంధాలనే మేము కోరుకుంటున్నాము. వారితో విభేదాలు, వివాదాలను పరిష్కరించుకుంటాము. క్రీడలలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నది మా ఆలోచన. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధించాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకుంటాము. ఆ తర్వాతే ఐపీఎల్‌ ప్రసారాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటాము’’ అని అమినుల్‌ హక్‌ పేర్కొన్నారు.

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా షాక్‌
కాగా టీ20 ప్రపంచకప్‌ సమయంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, ప్రభుత్వం ఓవరాక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌కు అన్యాయం చేస్తున్నారని.. తాము కూడా బంగ్లాకు మద్దతుగా టోర్నీ నుంచి తప్పుకొంటామని నాటకాలు ఆడింది. తర్వాత యథావిధిగా మాట మార్చి టోర్నీ ఆడి.. సెమీస్‌ చేరుకుండానే నిష్క్రమించింది. 

పీసీబీ ఇలా ఓవరాక్షన్‌ చేయగా.. బంగ్లాదేశ్‌ తాజాగా భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు సంకేతాలు ఇవ్వడం గమనార్హం. మరోవైపు.. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలోనూ బంగ్లా బోర్డు సానుకూల వైఖరితో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. 

చదవండి: హక్కుగా భావిస్తున్నారు.. వాళ్లపై వేటు వేయండి: గావస్కర్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement