దశాబ్దపు అత్యుత్తమ వన్డే క్రికెటర్‌గా ఎంపిక

Virat Kohli Named ODI Cricketer Of The 2010s By Wisden Almanack - Sakshi

లండన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విస్డెన్‌ అత్యుత్తమ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది డికేడ్‌(2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ ప్రకటించిన మేల్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది డికేడ్‌గా ఎంపికైన కోహ్లికి మరో  అత్యుత్తమ గౌరవం లభించింది. 2011 వన్డే ప్రపంచకప్‌తో దశాబ్దాన్ని ప్రారంభించిన ​కోహ్లి..  దశాబ్ద కాల వ్యవధిలో 60కిపైగా సగటుతో 11000కుపైగా పరుగులు సాధించాడు. ఇందులో 42 శతకాలు ఉన్నాయి. 2011 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో ఓ శతకం మరో అర్ధశతకం సాయంతో 282 పరుగులు సాధించిన కోహ్లి..  భారత్‌ను రెండోసారి జగజ్జేతగా నిలపడంలో తనవంతు పాత్రను పోషించాడు. 

రెండేళ్ల అనంతరం 2013లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో కూడా విరాట్‌ అద్భుతంగా రాణించి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నీ ఫైనల్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అతను భారత కీర్తిపతాకను మరోసారి రెపరెపలాడించాడు. 2010 దశాబ్దంలో జరిగిన 5 ఐసీసీ టోర్నీల్లో కోహ్లి అద్భుతంగా రాణించడంతో టీమిండియా ప్రతి టోర్నీలో కనీసం సెమీస్‌ వరకు చేరుకోగలిగింది. కాగా, కోహ్లి తన ఓవరాల్‌ వన్డే కెరీర్‌లో 254 మ్యాచ్‌ల్లో 59.7 సగటుతో 12169 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 62 హాఫ్‌ సెంచరీలున్నాయి. ఇక మహిళల విభాగంలో ఆసీస్‌ క్రికెటర్‌ బెత్‌ మూనీ విస్డెన్‌ ఉత్తమ మహిళా క్రికెటర్‌ అవార్డు గెలుచుకుంది. కాగా, విస్డెన్‌ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టును కూడా ప్రకటించింది. ఆ జట్టుకు కోహ్లినే నాయకుడిగా ఎంపిక చేసింది.

విస్డెన్‌ దశాబ్దపు ఉత్తమ టెస్ట్‌ జట్టు: అలిస్టర్‌ కుక్‌(ఇంగ్లండ్‌), వార్నర్‌(ఆస్ట్రేలియా), కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌), కోహ్లి(కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా), సంగక్కర(శ్రీలంక), బెన్‌ స్టోక్స్‌(ఇంగ్లండ్‌), అశ్విన్‌(భారత్‌), స్టెయిన్‌(దక్షిణాఫ్రికా), బ్రాడ్‌(ఇంగ్లండ్‌), ఆండర్సన్‌(ఇంగ్లండ్‌)  
చదవండి: విలియమ్సన్‌ను ఆడించకపోవడంపై ఎస్‌ఆర్‌హెచ్ క్లారిటీ‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top