Sakshi News home page

పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న విండీస్‌

Published Fri, Dec 22 2023 12:48 PM

Two Time T20 World Cup Champions West Indies Are Completely Dominant In T20 Format This Year - Sakshi

వివిధ కారణాల చేత పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లంతా ఒక్కసారిగా జట్టు నుంచి తప్పుకోవడంతో వన్డే ప్రపంచకప్‌కు సైతం అర్హత సాధించలేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్న వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు ఇటీవలికాలంలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. రసెల్‌, పూరన్‌ లాంటి సీనియర్లు తిరిగి జట్టులో చేరడంతో కరీబియన్‌ జట్టు  ఇంటాబయటా వరుస సిరీస్‌ విజయాలతో దూసుకుపోతుంది.

తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న ఈ మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌.. దీనికి ముందు స్వదేశంలోనే భారత్‌పై 3-2 తేడాతో టీ20 సిరీస్‌ నెగ్గింది. దీనికి ముందు సౌతాఫ్రికాలో వారిపై 2-1 తేడాతో టీ20 సిరీస్‌ గెలిచింది.

వచ్చే ఏడాది స్వదేశంలో టీ20 వరల్డ్‌కప్‌ ఉండటంతో ఇప్పటినుంచే సన్నాహకాలను మొదలుపెట్టిన విండీస్‌ బోర్డు జట్టును వీడిన సీనియర్లనంతా ఒక్కొక్కరిగా తిరిగి జట్టులోకి ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం విండీస్‌ ఉన్న ఊపు చూస్తుంటే మూడోసారి టీ20 ఛాంపియన్‌గా నిలవడం ఖయామని అనిపిస్తుంది. 

కాగా, ట్రినిడాడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది.

Advertisement
Advertisement