Tokyo Olympics: ఈ ఎండల్లో ఆడి చావమంటారా..? స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారుడి ఆగ్రహం

Tokyo Olympics: Daniil Medvedev Struggles In Extreme Heat At Ariake Tennis Park - Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌కు వేదికైన టోక్యో నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్‌ మ్యాచ్‌లను మాధ్యాహ్నం వేళల్లో నిర్వహించడంపై ప్రపంచ నంబర్‌ 2 టెన్నిస్‌ క్రీడాకారుడు డేనిల్‌ మెద్వెదెవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరియాకె టెన్నిస్‌ పార్క్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో భానుడి ప్రతాపం ధాటికి మెద్వెదెవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జపాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌ సందర్భంగా మెద్వెదెవ్‌ డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. 

ఎండ వేడిమిని తాళలేక మ్యాచ్‌ మధ్యలో చైర్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. నేను యోధున్ని కాబట్టి గేమ్‌ను ఎలాగైనా పూర్తి చేస్తాను. ఈ మధ్యలో నేను చనిపోతే ఎవరిది బాధ్యత అంటూ నిర్వాహకలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా మ్యాచ్‌ల నిర్వహణ సమయాన్ని మారుస్తారా లేక ఈ ఎండల్లో ఆడి చావమంటారా అంటూ నిర్వహకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కాగా, నిప్పులు కక్కుతున్న భానుడి ప్రతాపం కారణంగా అరియాకె టెన్నిస్‌ పార్క్‌లో బుధవారం ఇద్దరు ఆటగాళ్లు వడదెబ్బతో మధ్యలోనే నిష్క్రమించారు. 

ఇదిలా ఉంటే, క్రీడాకారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వాహకులు స్పందించారు. మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మారుస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు (జపాన్‌ కాలమానం ప్రకారం) మొదలు కావాల్సిన మ్యాచ్‌లు గురువారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయని పేర్కొన్నారు. కాగా, మూడో రౌండ్‌ మ్యాచ్‌లో రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌వోసీ) ఆటగాడు మెద్వదెవ్‌.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిపై 6-2, 3-6, 6-2తేడాతో విజయం సాధించి, క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top