
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తస్కిన్ అహ్మద్ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నివేదికల ప్రకారం అతనిపై కేసు నమోదైంది. ఈనెల 26న తస్కిన్.. అతని స్నేహితుడు సిఫాతుర్ రెహ్మాన్ సౌరవ్పై దాడి చేశాడు. మీర్పూర్ మోడల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై స్థానిక జర్నలిస్ట్లు తస్కిన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.
ఈ విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (బీసీబీ) చెందిన కీలక అధికారి స్పందిస్తూ ఇలా అన్నాడు. ఈ వార్తను సమాచార మాధ్యమాల్లో చూశాను. ఒకవేళ ఇది నిజమే అయితే విచారకరం. తస్కిన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఇలాంటి విషయాల్లో తలదూర్చకూడదు. ఈ విషయంపై విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని అన్నాడు.
మరో వాదన
తస్కిన్కు సంబంధించి ఇదే విషయంలో మరో ప్రచారం కూడా జరుగుతుంది. తస్కిన్ బీసీబీ డైరెక్టర్తో మాట్లాడి తాను నిర్దోషినని చెప్పాడట. కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించారని సంజాయిషీ ఇచ్చాడట. గొడవ జరిగిన మాట వాస్తవమే అని.. అయితే అందులో తన ప్రమేయమేమీ లేదని వివరణ ఇచ్చాడట.
తస్కిన్ బీసీబీ డైరెక్టర్తో ఇలా చెప్పాడట..
ఆ రోజు తన మిత్ర బృందంలోని రెండు గ్రూప్ల మధ్య గొడవ జరిగింది. అందులో ఓ వర్గం తనను మీర్పూర్ పోలీసులకు ఫోన్ చేయమని చెప్పింది. వారి కోరిక మేరకు నేను పోలీసులకు ఫోన్ చేశాను. ఇందుకు ఆగ్రహించిన మరో వర్గం తనపై కేసు నమోదు చేసింది.
ఈ ఘటన తస్కిన్ పాకిస్తాన్తో మూడో టీ20 ఆడిన అనంతరం జరిగింది. మీర్పూర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తస్కిన్ 3 వికెట్లు తీశాడు. 30 ఏళ్ల రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన తస్కిన్ బంగ్లాదేశ్ తరఫున 17 టెస్ట్లు, 81 వన్డేలు, 76 టీ20లు ఆడి 254 వికెట్లు తీశాడు. తస్కిన్ పేరిట టెస్ట్ల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది.