T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడు | T20 World Cup 2024: Rohit Sharna completes 600 sixes in international cricket | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడు

Jun 6 2024 7:29 AM | Updated on Jun 6 2024 9:03 AM

T20 World Cup 2024: Rohit Sharna completes 600 sixes in international cricket

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ద సెంచరీ చేసిన హిట్‌మ్యాన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

2007 నుంచి ఇప్పటివరకు 473 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 499 ఇన్నింగ్స్‌ల్లో 600 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ తర్వాతి స్థానంలో క్రిస్‌ గేల్‌ (553), షాహిద్‌ అఫ్రిది (476), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (398), మార్టిన్‌ గప్తిల్‌ (383) టాప్‌-5లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 330 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్‌ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్‌ కోహ్లి 12వ స్థానంలో ఉన్నారు.

కాగా, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్‌ను 96 పరుగులకే (16 ఓవర్లు) ఆలౌట్‌ చేశారు. హార్దిక్‌ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-35-2), సిరాజ్‌ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్‌ పటేల్‌ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో లోర్గాన్‌ టక్కర్‌ (10), కర్టిస్‌ క్యాంపర్‌ (12), గెరాత్‌ డెలానీ (26), జాషువ లిటిల్‌ (14) రెండంకెల స్కోర్‌ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్‌ స్టిర్లింగ్‌ (2), హ్యారీ టెక్టార్‌ (4), జార్జ్‌ డాక్రెల్‌ (3), మార్క్‌ అదైర్‌ (3), బ్యారీ మెక్‌ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్‌ (37 బంతుల్లో 52 రిటైర్డ్‌ హర్ట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి టీమిండియాను గెలిపించారు. వీరిద్దరు సత్తా చాటడంతో భారత్‌ 12.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐసీసీ ఈవెంట్లలో రోహిత్‌తో కలిసి తొలిసారి ఓపెనింగ్‌ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంత్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ ఫినిష్‌ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతి​కి బంతి బలంగా తాకడంతో రోహిత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 

Advertisement
 
Advertisement
Advertisement