టీమిండియా గ్రూప్ దశలో అజేయంగా నిలిచినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిందన్నది వాస్తవం. తొలుత అమెరికా.. ఆఖర్లో నెదర్లాండ్స్ రూపంలో పసికూనలు.. పటిష్ట సూర్యకుమార్ సేనకు సవాలు విసిరాయి. నమీబియా, పాకిస్తాన్లపై మాత్రమే భారత్ ఏకపక్ష విజయం సాధించింది.
76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తుగా
ఈ నేపథ్యంలో సూపర్-8లో జాగ్రత్తగా ఆడి సమిష్టిగా రాణించకపోతే కష్టాలు తప్పవని టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandra Ashwin) ముందుగానే హెచ్చరించాడు.
అందుకు తగ్గట్లుగానే భారత్ సూపర్-8లో తమ తొలి మ్యాచ్లో ఘోర పరాజయం పాలైంది. సమిష్టి వైఫల్యంతో 76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది.
తప్పు చేశారు
అయితే, సౌతాఫ్రికా చేతిలో ఓటమికి ప్రధాన కారణం భారత తుదిజట్టు కూర్పేనని మెజారిటీ మంది విశ్లేషకుల అభిప్రాయం. అశ్విన్ కూడా ఇదే మాట అంటున్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నిర్ణయాలను అశూ తప్పుబట్టాడు. అక్షర్ పటేల్ను కాదని.. వాషింగ్టన్ సుందర్ని ఆడించి పెద్ద తప్పే చేశారని విమర్శించాడు.
‘‘ఐపీఎల్లో మ్యాచ్-అప్లకు అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ల కోసం పర్టికులర్గా ఓ బౌలర్తో వ్యూహాలు అమలు చేసే వీలు ఉంటుంది. అక్కడ మనకు పద్నాలుగు మ్యాచ్లు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు.
కానీ ఐసీసీ ఈవెంట్లలో జట్టు ఎంత స్థిరంగా ఉంటే అంత మంచిది. తరచూ మార్పులు చేయడం తగదు. ఎడమచేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్ చేయించాలని వాషింగ్టన్ సుందర్ను తీసుకురావడాన్ని నేను వంద శాతం సమర్థిస్తాను.
అతడు MVP.. అలాంటి వాడినే పక్కనపెడతారా?
అదే సమయంలో అక్షర్ పటేల్ను పక్కన పెట్టడాన్ని మాత్రం ఎంతమాత్రం అంగీకరించను. టీ20 క్రికెట్లో అక్షర్ అత్యంత విలువైన ఆటగాడు (MVP). ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించాడు. ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో విరాట్ కోహ్లితో కలిసి అక్షర్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.
ఫలితంగా టీమిండియా 170 పరుగుల మార్కు దాటింది. అనుభవజ్ఞుడైన కోహ్లికి అక్షర్ అక్కడ సాయంగా నిలిచాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టి ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించారు.
చక్కటి గుణపాఠం
ఇక రింకూ సింగ్ విషయానికొస్తే.. మీకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. అలాంటపుడు రింకూను ఎనిమిదో స్థానంలోనే పంపడం ఎందుకు?.. ఏదేమైనా వాషీని నేను అగౌరవపరచడం లేదు. కానీ సౌతాఫ్రికా టీమిండియాకు చక్కటి గుణపాఠం నేర్పింది. సన్నద్ధం కాకుండా మ్యాచ్కు వస్తే ఇలాగే జరుగుతుంది అని చాటిచెప్పింది’’ అంటూ అశ్విన్ తీవ్ర స్థాయిలో టీమిండియా నాయకత్వ బృందం తీరుపై మండిపడ్డాడు.
కాగా సౌతాఫ్రికాతో ఆదివారం నాటి సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్లో అక్షర్కు బదులు తుదిజట్టులో ఆడిన వాషీ.. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులే చేయగలిగాడు. ఇక రింకూ సింగ్ డకౌట్ అయ్యాడు. శివం దూబే 42 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.
చదవండి: T20 WC 2026: టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్


