
తీవ్ర ఒత్తిడిలో హైదరాబాద్ టీమ్
సొంత మైదానంలో గెలుపుపై గురి
నేడు పంజాబ్ కింగ్స్తో మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు మ్యాచ్లలో పరాజయం... భారీ అంచనాలు పెట్టుకున్న టాప్–3 వరుసగా విఫలం...టోర్నీలో అన్ని జట్లకంటే చెత్త ఎకానమీ (10.73) నమోదు చేసిన బౌలర్లు... బౌలింగ్ సగటు కూడా అన్నింటికంటే ఎక్కువ (41.47)... బ్యాటర్ల నుంచి పరుగులు రావడం లేదు... బౌలర్ల ప్రదర్శన పేలవం... ఇలా అన్నీ సమస్యలే! ఇలాంటి స్థితిలో సన్రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.
ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో నేడు జరిగే సమరంలో పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ తలపడుతుంది. ఆడిన నాలుగు మ్యాచ్లో మూడు విజయాలతో ఫామ్లో ఉన్న పంజాబ్ను రైజర్స్ ఏమాత్రం నిలువరిస్తుందనేది చూడాలి. మ్యాచ్ ముందు రోజు నగరంలో కాస్త చల్లటి వాతావరణం ఉన్నా... శనివారం రోజు వర్షసూచన లేదు.
వరుస వైఫల్యాలు...
హైదరాబాద్లో ఆడిన తొలి మ్యాచ్లో రాజస్తాన్పై 286 పరుగుల స్కోరుతో సీజన్ను సన్రైజర్స్ ఘనంగా ప్రారంభించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి నాలుగు మ్యాచ్లలో జట్టు వరుసగా 190, 163, 120, 152 పరుగులు చేసింది. అయితే ఇవేవీ విజయానికి సరిపోలేదు. తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీని మినహాయిస్తే ఓవరాల్గా ఈ నాలుగు మ్యాచ్లలో కలిపి రైజర్స్ నుంచి 2 అర్ధసెంచరీలు నమోదయ్యాయి.
క్లాసెన్ గరిష్టంగా 152 పరుగులే చేయగా... హెడ్ 148, అభిషేక్ 51 పరుగులు సాధించడం బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. నితీశ్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. స్కోర్లు మాత్రమే కాదు, జట్టు ఆటగాళ్లలో ఒక రకమైన నిరాసక్తత కనిపిస్తోంది. మైదానంలో చురుకుదనం లోపించగా... గత ఏడాది తరహాలో పరుగులు సాధించాలనే తపన, కసి బ్యాటర్లలో కనిపించడం లేదు. వరుస ఓటముల ప్రభావం కూడా ఆటగాళ్లపై పడింది.
అయితే దీని నుంచి కోలుకొని మళ్లీ చెలరేగేందుకు ఈ మ్యాచ్కు మించి మంచి అవకాశం లభించదు. కెపె్టన్ కమిన్స్ వికెట్లు తీయకపోవడంతో పాటు ఏకంగా 11.16 ఎకానమీతో పరుగులు ఇస్తున్నాడు. షమీలాంటి ప్రధాన పేసర్ కూడా 9.29 ఎకానమీతో పరుగులు ఇవ్వడం చూస్తే బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. ఈసారి ఓడితే మాత్రం కోలుకొని ప్లే ఆఫ్స్ రేసులోకి రావడం సన్రైజర్స్కు దాదాపు అసాధ్యం కావచ్చు.
జోరు మీదున్న కింగ్స్...
శ్రేయస్ అయ్యర్, ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య... పంజాబ్ గెలిచి మూడు మ్యాచ్లలో వీరు ముగ్గురు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచిన ఆటగాళ్లు. అంటే జట్టు ఏ ఒక్కరి బ్యాటింగ్పైనే ఆధారపడటం లేదు. పరిస్థితిని బట్టి ఒక్కో ప్లేయర్ బాధ్యత తీసుకొని నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురికి తోడు నేహల్ వధేరా, శశాంక్ సింగ్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అద్భుత ఫామ్లో ఉన్న అయ్యర్ 200 పరుగులు స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించాడు.
స్టొయినిస్, మ్యాక్స్వెల్లాంటి ఆటగాళ్లు రాణించకపోయినా పంజాబ్ మెరుగైన స్థితిలో ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే జట్టు మరో సారి భారీ స్కోరు సాధించడం ఖాయం. బౌలింగ్లో అర్ష్ దీప్, ఫెర్గూసన్ ముందుండి నడిపిస్తుండగా... యశ్ ఠాకూర్ కూడా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 ఓవర్లు వేసి ఒకే ఒక వికెట్ తీసిన చహల్ మాత్రం ఇంకా లయ అందుకోలేదు. అతనూ రాణిస్తే రైజర్స్ను కట్టడి చేయవచ్చు.
తుది జట్లు (అంచనా)
సన్రైజర్స్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్, కమిందు, అన్సారీ, హర్షల్, షమీ, రాహుల్ చహర్.
పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్, వధేరా, శశాంక్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, యాన్సెన్, చహల్, అర్ష్ దీప్, ఫెర్గూసన్, యశ్ ఠాకూర్.