T20 World Cup 2022: బుమ్రా దూరం కాలేదు : గంగూలీ

టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్కు దూరమైన సంగతి తెలిసిందే. ఇది టీమిండియాకు పెద్ద దెబ్బ అని క్రీడా విశ్లేషకులు, అభిమానులు పేర్కొన్న సమయంలో గంగూలీ బుమ్రా దూరమవడంపై స్పందించాడు. ''బుమ్రా టి20 ప్రపంచకప్కు పూర్తిగా దూరం కాలేదు.. వరల్డ్కప్లోగా అతను కోలుకుంటే ఆడే అవకాశం ఉందంటూ'' హింట్ ఇచ్చాడు.
వాస్తవానికి బుమ్రా టి20 ప్రపంచకప్కు దూరమైనట్లు బీసీసీఐ ఇప్పటిదాకా అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కేవలం సౌతాఫ్రికాతో జరగనున్న మిగతా రెండు టి20 మ్యాచ్లకు మాత్రమే బుమ్రా ఆడడం లేదని.. ప్రస్తుతం అతను బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. ప్రొటిస్తో మిగతా రెండు టి20లకు మాత్రమే బుమ్రా స్థానంలో సిరాజ్ను ఎంపిక చేసినట్లు పేర్కొంది.
కాగా టి20 ప్రపంచకప్కు సంబంధించి అక్టోబర్ 16 వరకు జట్టును మార్చుకునే అవకాశం ఉండడంతో అప్పటివరకు వేచి చూద్దామనే ధోరణిలోనే బీసీసీఐ ఉంది. అయితే గాయంతో టి20 ప్రపంచకప్కు బుమ్రా దూరమైనట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(PTI) సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పేపర్లలో వార్తలు వచ్చాయి.
ఇదే విషయమై గంగూలీ స్పష్టం చేశాడు. ''జస్ప్రీత్ బుమ్రా ఇంకా టి20 ప్రపంచకప్ నుంచి వైదొలగలేదు. మెగాటోర్నీకి జరగడానికి ఇంకాస్త సమయం ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేం. వరల్డ్కప్ నాటికి బుమ్రా కోలుకుంటే ఆడే అవకాశం ఉంది.'' అంటూ పేర్కొన్నాడు. కాగా గంగూలీ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. దాదా వ్యాఖ్యలు అభిమానులను సంతోషపెట్టేదే అయినా.. అతని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మాత్రం కొంతకాలం రెస్ట్ ఇవ్వడమే బెటర్ అని మెజారిటీ వర్గాల అభిప్రాయం.
చదవండి: బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ సిరాజ్.. బీసీసీఐ ప్రకటన
మరిన్ని వార్తలు