డబుల్‌ సెంచరీ చేసేవాడినే... కానీ | Shubman Gill Reveals He Targeted Double Century But Focused On Team Total Of 430+, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీ చేసేవాడినే... కానీ

Jun 18 2026 9:02 AM | Updated on Jun 18 2026 10:16 AM

Shubman Gill Admits He Targeted Double Century But keep 430 in mind

అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఆత్మవిశ్వాసంతో
ఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) తొలి సిరీస్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 154 పరుగులతో బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మొదటి బంతి నుంచే నేను ఆత్మవిశ్వాసంతో బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం రావడం చూశాను.

40- 45 ఓవర్ల పాటు 
ఈ సిరీస్‌లో నాకు నేనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్‌లు ఫినిష్‌ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని టార్గెట్‌ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా.

డబుల్‌ సెంచరీ చేసేవాడినే... కానీ
ఈరోజు డబుల్‌ సెంచరీ పూర్తి చేయాలనే అనుకున్నా. కానీ జట్టు స్కోరు 430, 440, 450 రేంజ్‌లో ఉండాలంటే నేను హిట్టింగ్‌ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. టాస్‌ ఓడినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఈ పిచ్‌ మీద 310- 320 మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించదగ్గ టార్గెటే.

అయితే, మేము ముందు నుంచే ప్రణాళికతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు’’ అని శుబ్‌మన్‌ గిల్‌ తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల.. అదే విధంగా జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో..
ఏకనా స్టేడియంలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. గిల్‌ (154)తో పాటు ఇషాన్‌ కిషన్‌ (125) మెరుపు సెంచరీ సాధించడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది.

 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ 44.3 ఓవర్లలో కేవలం 232 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. భారత పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రిన్స్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

చదవండి: వైభవ్‌ సూర్యవంశీకి బీసీసీఐ షాక్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement