కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌! | Shreyas Vs Suryakumar: Mumbai To Pick India Star For White Ball Captaincy | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌!

Sep 2 2026 12:19 PM | Updated on Sep 2 2026 12:21 PM

Shreyas Vs Suryakumar: Mumbai To Pick India Star For White Ball Captaincy

టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీతో సూర్య (PC: ICC)

టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత ఆడిన తొలి సిరీస్‌లోనే అతడిపై వేటు పడింది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యను తప్పించిన యాజమాన్యం.. జట్టులోనూ అతడికి చోటు లేకుండా చేసింది. కెప్టెన్‌గా విజయవంతమైనా.. బ్యాటర్‌గా విఫలమైనందున 35 ఏళ్ల సూర్యకుమార్‌ను నిర్దాక్షిణ్యంగా జట్టు నుంచి తప్పించింది.

ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ గనుక మళ్లీ దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో సత్తా చాటితే తిరిగి టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

ఆ ఇద్దరిలో ఒకరు!
దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ముంబై జట్టుకు సూర్య కెప్టెన్‌ కానున్నట్లు సదరు అధికారి సంకేతాలు ఇచ్చారు. పీటీఐతో మాట్లాడుతూ.. ‘మా జట్టులో శ్రేయస్ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నారు. వన్డే, టీ20 ఫార్మాట్‌లకు ఈ ఇద్దరిలో ఎవరు అందుబాటులో ఉంటే వారే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు’ అని ఎంసీఏ అధికారి తెలిపారు.

అయ్యర్‌.. అంచెలంచెలుగా ఎదిగి
కాగా దేశవాళీ క్రికెట్‌ ముంబై తరఫున.. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా అత్యుత్తమంగా రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌కు ఊహించని అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. మూడేళ్లుగా భారత టీ20 జట్టులో చోటు కోసం పరితపించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. అనూహ్య రీతిలో ఏకంగా కెప్టెన్‌గా పునరాగమనం చేశాడు. 

టీమిండియాకు మూడో ప్రపంచకప్‌ అందించిన సూర్యకుమార్‌ స్థానాన్ని సెలక్టర్లు శ్రేయస్‌తో భర్తీ చేశారు. ప్రస్తుతం అతడు అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌తో బిజీ కానున్నాడు. కాగా 2024–25 సీజన్‌ ఫైనల్లో మధ్యప్రదేశ్‌ను ఓడించి శ్రేయస్‌ సారథ్యంలోని ముంబై జట్టు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. నవంబరు 14 నుంచి డిసెంబరు 6 మధ్య సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఆ సమయంలో టీమిండియా సిరీస్‌లతో శ్రేయస్‌ అయ్యర్‌ బిజీగా ఉంటే.. సూర్యనే ముంబై జట్టును కెప్టెన్‌గా ముందుకు నడిపిస్తాడు.

రంజీ జట్టు కెప్టెన్‌గా సిద్ధేశ్‌ లాడ్‌
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు సిద్ధేశ్‌ లాడ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అక్టోబర్‌ 11 నుంచి తాజా రంజీ సీజన్‌ ప్రారంభం కానుండగా... ఎంసీఏ సారథ్య మార్పు వివరాలను మంగళవారం వెల్లడించింది. గత సీజన్‌లో ముంబై జట్టుకు పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా... అతడిపై అదనపు భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్‌సీఏ వెల్లడించింది.

ఇక 2025–26 రంజీ సీజన్‌లో క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన ముంబై జట్టు... కొత్త సీజన్‌ను సిద్ధేశ్‌ సారథ్యంలో ప్రారంభించనుంది. 34 ఏళ్ల సిద్ధేశ్‌ గత సీజన్‌లో 77.40 సగటుతో 774 పరుగులు చేశాడు. నిలకడైన బ్యాటింగ్‌తో పాటు పరిణతి చెందిన ఆటతీరుతో అతడు నాయకత్వ అవకాశం దక్కించుకున్నాడు. 

42సార్లు చాంపియన్‌గా
హరియాణా, చండీగఢ్, హిమాచల్‌ ప్రదేశ్, రాజస్తాన్, రైల్వేస్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ జట్లతో కలిసి గ్రూప్‌ ‘డి’ నుంచి బరిలోకి దిగనున్న ముంబై... తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో తలపడనుంది.

రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు... వరుసగా రెండో ఏడాది కొత్త కెప్టెన్‌ సారథ్యంలో రంజీ ట్రోఫీ ఆడనుంది. 2023–24లో చివరిసారిగా అజింక్య రహానే సారథ్యంలో ముంబై జట్టు ట్రోఫీ గెలిచింది. 

గత సీజన్‌లో శార్దుల్‌ ఠాకూర్‌ అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించగా... ఈ సారి ప్రధాన పేసర్‌గా అతడికి మరింత స్వేచ్ఛనివ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

చదవండి: IND vs AFG: జట్టులో అతడు ఎందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement