సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్గా, వన్డౌన్ బ్యాటర్గా సత్తా చాటిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్-2026లోనూ పరుగుల వరద పారించాడు.
వన్డేలలోనూ రీఎంట్రీ
సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున పదిహేను మ్యాచ్లలో కలిపి 602 పరుగులు సాధించాడు. ఈ మేరకు టీ20లలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) వన్డేలలోనూ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత జట్టుకు దూరమైన ఇషాన్.. అఫ్గనిస్తాన్ స్వదేశంలో జూన్ 13 నుంచి మొదలుకానున్న సిరీస్కు ఎంపికయ్యాడు.
సీనియర్ కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో ఇషాన్కు యాజమాన్యం ఈ మేరకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
మూడో వికెట్ కీపర్గా..
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్, ఇషాన్లతో పాటు భారత్ మూడో వికెట్ కీపర్ను కూడా ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని సూచించాడు. సంజూ శాంసన్ను బ్యాకప్ కీపర్గా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ టోర్నీ నేపథ్యంలో నంబర్ వన్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు ప్రాధాన్యం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగలడు. విలక్షణమైన ఆటగాడు.
అతడి వన్డే రికార్డు గొప్పగా ఉంది
ఇక ఇషాన్ కిషన్ సైతం ఓపెనర్గా రాణించగలడు. వన్డౌన్లోనూ ఆడగలడు. అందుకే వారిద్దరికి సెలక్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, సంజూ శాంసన్ వన్డే రికార్డు కూడా గొప్పగా ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా అతడు రాణించాడు.
ఒత్తిడిలోనూ రాణించగల పరిణతి సాధించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కాబట్టి సంజూను కూడా సెలక్టర్లు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. కాగా సంజూ ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడి 510 పరుగులు సాధించాడు. చివరగా 2023 డిసెంబరులో టీమిండియా తరఫున వన్డే ఆడాడు.


