Sakshi Media Group: ధనాధన్‌ టోర్నీకి దండోరా

Sakshi Media Group: Sakshi Premier League 2023 Invitation of Entries 6 Jan 2023

సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీకి ఎంట్రీల ఆహ్వానం  

బ్యాట్‌ పట్టుకొని బంతిని బౌండరీ దాటించాలని ఉందా? బుల్లెట్‌ వేగంతో బంతులు వేస్తూ వికెట్లను గిరాటేయాలని ఉందా? మెరుపు వేగంతో కదులుతూ బ్యాటర్లను రనౌట్‌ చేయాలని ఉందా? క్రికెట్‌ ఆడేద్దామని... మనలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని మనసులో బలమైన కోరిక ఉంటే సరిపోదు.. దానికి వేదిక కూడా కావాలిగా! ఇలాంటి ఔత్సాహిక క్రికెటర్లు తమ కలలు నెరవేర్చుకునేందుకు మళ్లీ సమయం వచ్చేసింది.

మరో ఆలోచన లేకుండా ముందుగా మీ జట్టును తయారు చేసుకొని ఎంట్రీలు పంపించండి.. ఆ తర్వాత సమరానికి ‘సై’ అనండి...ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో 2023 జనవరి మూడో వారంలో సాక్షి ప్రీమియర్‌ లీగ్‌  క్రికెట్‌ టోర్నీ నాలుగో సీజన్‌ మొదలుకానుంది.  

మూడో సీజన్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 627 జట్లు బరిలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ విభాగంలో సీకామ్‌ డిగ్రీ కాలేజీ (తిరుపతి)... జూనియర్‌ విభాగంలో సీఆర్‌ రెడ్డి పాలిటెక్నిక్‌ కాలేజీ (ఏలూరు) చాంపియన్స్‌గా నిలిచాయి. తెలంగాణ సీనియర్‌ విభాగంలో ఎంఎల్‌ఆర్‌ఐటీ (దుండిగల్‌), జూనియర్‌ విభాగంలో గౌతమ్‌ జూనియర్‌ కాలేజీ (ఈసీఐఎల్‌) జట్లు టైటిల్స్‌ సాధించాయి.  

టోర్నీ ఫార్మాట్‌...
ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లపాటు నిర్వహిస్తారు.  జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్లపాటు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో టైటిల్‌ కోసం తలపడతాయి.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు.  

ఎంట్రీ ఫీజు...
ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్‌ కార్యాలయంలో సంప్రదించాలి. https://www.arenaone.in/registration వెబ్‌సైట్‌లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను జనవరి 6వ తేదీలోపు పంపించాలి.  

ఏ ఏ విభాగాల్లో...
సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్‌–19 జూనియర్‌ స్థాయిలో (1–1– 2003 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్‌–25 సీనియర్‌ స్థాయిలో (1–1–1997 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు.  

జూనియర్‌ స్థాయిలో ఆడేందుకు జూనియర్‌  కాలేజీ జట్లకు,  సీబీఎస్‌ఈ స్కూల్‌ జట్లకు (ప్లస్‌ 11,12 ), ఐటీఐ, పాలిటెక్నిక్‌ జట్లకు అర్హత     ఉంది.  సీనియర్‌ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కల్పిస్తారు.  

ఎన్ని జట్లకు అవకాశం...
ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా రెండు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. రెండు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు. మ్యాచ్‌లు ఆడే సమయంలో ఆటగాళ్లు వయసు ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మ్యాచ్‌ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్‌) చూపించాలి. మ్యాచ్‌ జరిగే సమయంలో బ్యాటర్స్, వికెట్‌ కీపర్‌ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్‌ ప్యాడ్‌లు, అండర్‌ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్‌ డ్రెస్, వైట్‌ షూస్‌ ధరించాలి.  

ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
 (తెలంగాణ రీజియన్‌) 9505514424, 9666013544  
(ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌) 9912671555, 7075709205, 9666697219

నోట్‌: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top