FIFA WC 2022: ఖతర్‌ను కలవరపెడుతున్న 'క్యామెల్‌ ప్లూ' వైరస్‌.. కరోనా కంటే డేంజర్‌

Reports: Virus Scare Fans Risk-of-Camel Flu Infection Qatar FIFA WC 2022 - Sakshi

ప్రపంచంలో అత్యంత క్రేజ్‌ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఖతర్‌ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్‌కప్‌ను లైవ్‌లో వీక్షించడానికి విశ్వవ్యాప్తంగా 1.2 మిలిమన్‌ అభిమానులు ఖతర్‌ వెళ్లినట్లు సమాచారం. వీరంతా తమకు ఇష్టమైన ఫిఫా వరల్డ్‌కప్‌ను ఎంజాయ్‌ చేస్తూనే అరబ్‌ దేశాల్లో ఒకటైన ఖతర్‌ అందాలను వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పరిశోధనా బృందం పెద్ద బాంబు పేల్చింది. ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్యామెల్‌ ప్లూ(Camel Flu Virus) అనే వైరస్‌ కలవరం సృష్టిస్తుందన్నారు.

వరల్డ్‌కప్‌ను వీక్షించడానికి వచ్చినవారిలో కొంతమంది అభిమానులు క్యామెల్‌ ప్లూ వైరస్‌తో భాదపడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. క్యామెల్‌ ప్లూ వైరస్‌ అనేది మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(MERS) వ్యాధితో బాధపడేలా చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఇక క్యామెల్‌ ప్లూ వైరస్‌ కరోనా వైరస్‌ కన్నా ప్రమాదకరమని.. ఈ వైరస్‌ను తొలుత 2012లో సౌదీ అరేబియాలో గుర్తించినట్లు వైద్య నిపుణులు స్పష్టం చేశారు.

రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా దాటికి ప్రపంచంలోని దేశాలన్ని లాక్‌డౌన్‌ విధించుకున్నాయి. ఇప్పటికే ఆ మహమ్మారి వదలడం లేదు. మెర్స్‌ వ్యాధి లక్షణాలు కరోనా లక్షణాలుగానే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, శ్వాసకోస ఇబ్బంది లాంటి సహజ లక్షణాలతోనే వ్యాధి ప్రారంభమవుతుంది. నుమోనియా లక్షణాలు కూడా దీనిలో అంతర్భాగం. ఈ వ్యాధికి గురైన వారు రోజురోజుకు మరింత వీక్‌గా మారిపోతుంటారు. విరేచనాలు, గ్యాస్‌ ట్రబుల్‌తో ఇబ్బంది పడుతుంటారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు హెచ్చరించారు. ఇక క్యామెల్‌ ప్లూ వైరస్‌ ద్వారా సంక్రమించే మెర్స్‌ వ్యాధితో మరణాల రేటు 35 శాతం ఉందని హెచ్చరించారు.

సాధారణంగా అరబ్‌ దేశాల్లో ఒంటెలతో  అక్కడి జనజీవనం ముడిపడి ఉంటుంది. క్యామెల్‌ ప్లూ.. పేరులోనే ఒంటె పేరు కనిపిస్తుండడంతో ఈ వైరస్‌ ఒంటెల ద్వారా సంక్రమిస్తున్నట్లు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యామెల్‌ రైడ్స్‌.. సఫారీ ఖతర్‌ ప్రజలకు జీవనాధారంగా ఉంది. అక్కడికే వచ్చే పర్యాటకులు క్యామెల్‌ రైడ్స్‌.. సఫారీ చేస్తుంటారు. 

క్యామెల్‌ ప్లూ వైరస్‌ కారణంగా ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ చూడడానికి వచ్చే ఫుట్‌బాల్‌ అభిమానులు ఒంటెలను నేరుగా తాకకూడదని ఇంతకముందే హెచ్చరించారు. ఇది తెలియని కొంత మంది అభిమానులు ఒంటెలను ముట్టుకోవడం.. వాటిపై సఫారీ చేయడం వల్ల క్యామెల్‌ ప్లూ వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది.

క్యామెల్‌ ప్లు అనేది జంతువుల నుంచి జంతువులకు.. జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అది నేరుగా లేదా ఇన్‌డైరెక్ట్‌గా వైరస్‌ అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌ 2022ను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో క్యామెల్‌ ప్లూ వైరస్‌ బాధితులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం తమను కలవరపెడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

చదవండి: FIFA WC: నాలుగుసార్లు చాంపియన్‌ ఇటలీ ఎక్కడ?

మెక్సికోపై గెలుపు.. షర్ట్‌ విప్పి రచ్చ చేసిన మెస్సీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top