టెహ్రాన్: గల్ఫ్లో అమెరికాకు చెందిన అతిపెద్ద రాడార్ను కచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడిలో పూర్తిగా ధ్వంసం చేశామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. ఖతార్ అధికారులు కూడా ఈ విషయం ధ్రువీకరించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో సామాన్య ప్రజలు బలైపోతున్నారు. అంతేకాకుండా అత్యంత విలువైన ఆయుధాలు, సైనిక సామగ్రి ధ్వంసమవుతున్నాయి. మౌలిక సదుపాయాలు కూడా నామరూపాల్లేకుండాపోతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాల్లో అమెరికాకు సైనిక స్థావరాలున్నాయి.
మిత్రదేశం ఖతార్లోని అల్ ఉదెయిద్ ఎయిర్బేస్లో ‘ఏఎన్/ఎఫ్పీఎస్–132’పేరిట అతిపెద్ద రాడార్ను అమెరికా నిర్వహిస్తోంది. ఈ రాడార్ ట్రాకింగ్ రేంజ్ ఏకంగా 5,000 కిలోమీటర్లు కావడం గమనార్హం. ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థకు రాడార్ అత్యంత కీలకం. శత్రుదేశాల యుద్ధ విమానాలు, డ్రోన్లను తొలుత రాడార్లు గుర్తిస్తాయి. గగనతల రక్షణ వ్యవస్థకు సమాచారం చేరవేస్తాయి. ‘ఏఎన్/ఎఫ్పీఎస్–132’రాడార్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఖండాంతర క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేలా డిజైన్ చేశారు. అమెరికా 2013లో 1.1 బిలియన్ డాలర్లతో ఈ రాడార్ను నెలకొల్పింది. కీలకమైన రాడార్ ధ్వంసం కావడంతో పశ్చిమాసియాలో అమెరికా సైనిక నిఘా కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురుకావడం తథ్యమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సన్నిహితంగా మెలిగే గల్ఫ్ దేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు కూడా పెద్ద దెబ్బేనని అంటున్నారు. ఈ రాడార్ను ఇన్నాళ్లూ ఇరాన్ క్షిపణి కార్యక్రమాలపై నిఘా కోసం ఉపయోగించారు


