అప్గానిస్తాన్తో వన్డే సిరీస్కు గాయంతో దూరమైన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ లెక్కన అభిమానులకు కోహ్లీ విషయంలో ఇది గుడ్న్యూస్.
జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే కోహ్లీ కండరాల గాయంతో సతమతమయ్యాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో చివరిదాకా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ కండరాల గాయం తీవ్రత పెరిగిపోయింది. దీంతో ఫైనల్ పూర్తయిన మరుసటి రోజే కోహ్లీ తన కాలిని స్కాన్ చేయించుకున్నాడు.
రిపోర్ట్లో కోహ్లి కాలిలో ఉండే డిస్టల్ సెమిమెంబ్రానోనస్ టెండన్ టియర్లో చీలిక వచ్చినట్లు తేలింది. డిస్టల్ సెమిమెంబ్రానోనస్ అనేది మోకాలి వెనుక భాగంలో ఉంటుంది. దీనిలో చీలిక వస్తే అది కాలి కండరాలను తీవ్రంగా బాధిస్తోంది. ఇది అత్యంత అరుదుగా జరుగుతుందని, కోలుకోవడానికి ఒక్కోసారి ఆరు నెలలు సమయం పడుతుందని వైద్యబృందం తెలిపింది.
కానీ కోహ్లీ విషయంలో అద్భుతం జరిగిందని, అతడి అసామాన్యమైన ఫిట్నెస్ కారణంగా నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటాడని పేర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడనే వార్తలు వస్తున్న వేళ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో ఇప్పటికే చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
37 ఏళ్ల కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు 85 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి ఆఖరి టోర్నీ అని ప్రచారం జరుగుతున్న వేళ టీమిండియా ఆ టోర్నీ వచ్చేలోగా స్వదేశం, విదేశం కలిపి సుమారు 28 నుంచి 30 వన్డేల వరకు ఆడే అవకాశముంది. ఇందులోనే ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఉన్నాయి. ఈ లెక్కన సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు.
చదవండి: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం?


