ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగించిన జితేశ్‌ శర్మ.. మెరుపు ఇన్నింగ్స్‌తో మరో టైటిల్‌ | RCB jitesh Sharma Continues IPL Form, Wins Vidarbha T20 Pro League As Captain | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగించిన జితేశ్‌ శర్మ.. మెరుపు ఇన్నింగ్స్‌తో మరో టైటిల్‌

Jun 18 2025 10:38 AM | Updated on Jun 18 2025 10:45 AM

RCB jitesh Sharma Continues IPL Form, Wins Vidarbha T20 Pro League As Captain

ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు జితేశ్‌ శర్మ ఐపీఎల్‌ 2025 ఫామ్‌ను కొనసాగించాడు. తాజాగా ముగిసిన విదర్భ టీ20 లీగ్‌ ఫైనల్లో తన జట్టు NECO మాస్టర్‌ బ్లాస్టర్‌ను సుడిగాలి ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. 

రెండు వారాల వ్యవధిలో జితేశ్‌ గెలిచిన రెండో టీ20 టైటిల్‌ ఇది. విదర్భ టీ20 లీగ్‌ ఫైనల్లో జితేశ్‌ జట్టు NECO మాస్టర్‌ బ్లాస్టర్‌ పరగారియా స్ట్రయికర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ కైవసం చేసుకుంది. 

ఈ గెలుపులో జితేశ్‌ కీలకపాత్ర పోషించాడు. 179 పరుగుల లక్ష్య ఛేదనలో జితేశ్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 14వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగి 11 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో అజేయమైన 30 పరుగులు చేశాడు. 

జితేశ్‌ ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లో లక్నోపై ఏ తరహాలో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడో, ఈ మ్యాచ్‌లోనూ అదే తరహాలో సిక్సర్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. జితేశ్‌ మెరుపు బ్యాటింగ్‌ ధాటికి అతని జట్టు మరో రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

జితేశ్‌ ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ తరఫున నాలుగో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 261 పరుగులు చేశాడు. లక్నోతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా బరిలోకి దిగి జితేశ్‌ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్‌ సీజన్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 

ఆ ఇన్నింగ్స్‌లో జితేశ్‌ 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 

అయితే జితేశ్‌ నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. జితేశ్‌ విధ్వంసం ధాటికి ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. 

అదే మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ మెరుపు శతకం (61 బంతుల్లో 118 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) బాదాడు. జితేశ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పంత్‌ శతకానికి విలువ లేకుండా పోయింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లోనూ జితేశ్‌ ఓ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 

కేవలం 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. ఈ పరుగులు ఆర్సీబీ గెలుపుకు దోహదపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ పంజాబ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. సీజన్‌ మొత్తంలో జితేశ్‌ ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement