క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌ | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

Published Fri, Mar 25 2022 4:02 AM

PV Sindhu, Kidambi Srikanth, HS Prannoy and Parupalli Kashyap reached the quarter-finals of the Swiss Open - Sakshi

బాసెల్‌: భారత అగ్రశ్రేణి షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు స్విస్‌ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పారుపల్లి కశ్యప్, హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌లు కూడా క్వార్టర్స్‌ చేరగా... వెటరన్‌ స్టార్‌ సైన నెహ్వాల్‌కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సింధు 21–19, 21–14తో నెస్లిహన్‌ యిగిట్‌ (టర్కీ)పై గెలుపొందగా, సైనా నెహ్వాల్‌ 21–17, 13–21, 13–21తో మలేసియా షట్లర్‌ కిసొన సెల్వదురై చేతిలో పరాజయం చవిచూసింది.

పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌ 13–21, 25–23, 21–11తో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపొవ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. మరో మ్యాచ్‌లో సీనియర్‌ షట్లర్‌ కశ్యప్‌కు అదృష్టం కలిసొచ్చి వాకోవర్‌తో ముందంజ వేశాడు. ప్రపంచ నంబర్‌వన్, డెన్మార్క్‌ స్టార్‌ విక్టర్‌ అక్సెల్సన్‌తో తలపడాల్సిన పోరులో ప్రత్యర్థి బరిలోకి దిగలేదు. దీంతో ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత కశ్యప్‌ ఒక టోర్నీలో క్వార్టర్స్‌ చేరాడు. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 19–21, 21–13, 21–9తో కలే కోల్జొనెన్‌పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్‌  సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జంట 19–21, 20–22తో ప్రముద్య కుసుమవర్దన–యెరెమియా రంబితన్‌ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది.   

Advertisement
Advertisement