
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతీక రావల్ దుమ్ములేపుతోంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ప్రతీక హాఫ్ సెంచరీతో మెరిసింది. రావల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 78 పరుగులు చేసింది.
ఈ క్రమంలో రావల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన బ్యాటర్గా ప్రతీక రికార్డులకెక్కింది. 24 ఏళ్ల ప్రతీక రావల్ (Pratika Rawal) తన వన్డే అరంగేట్రం నుంచి అదరగొడుతోంది.
ఈ క్రమంలో కేవలం 8 మ్యాచ్లలోనే ప్రతీక 500 పరుగుల మార్క్ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. 9 ఇన్నింగ్స్లలో ఆమె ఈ ఫీట్ను సాధించింది. తాజా మ్యాచ్తో ఎడ్వర్డ్స్ ఆల్టైమ్ రికార్డును రావల్ బ్రేక్ చేసింది.
మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే..
ప్రతికా రావల్ - 8 ఇన్నింగ్స్లు
షార్లెట్ ఎడ్వర్డ్స్ - 9 ఇన్నింగ్స్లు
నికోల్ బోల్టన్ - 11 ఇన్నింగ్స్లు
బెలిండా క్లార్క్ - 12 ఇన్నింగ్స్లు
వెండీ వాట్సన్ - 12 ఇన్నింగ్స్లు
ఇక ఈ మ్యాచ్లో సౌతాఫ్రికాపై 15 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 277 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచే కన్పించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. రాణా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది.
చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం