బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు | Police Told RCB To Hold Celebrations On Sunday, Franchise Rejected The Idea Says Report | Sakshi
Sakshi News home page

Bengaluru Stampede: బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

Jun 5 2025 12:37 PM | Updated on Jun 5 2025 1:48 PM

Police Told RCB To Hold Celebrations On Sunday, Franchise Rejected The Idea Says Report

ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో నిన్న (జూన్‌ 4) జరిగిన బెంగళూరు దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మంది​కి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది.

ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం​ (జూన్‌ 4) ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకోవద్దని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పట్టించుకోలేదు. విజయోత్సవ వేడులు బుధవారానికి బదులు ఆదివారం (జూన్‌ 8) నిర్వహించుకోవాలని సూచించారు.

టైటిల్‌ గెలిచిన మరుసటి రోజే వేడుకలు నిర్వహిస్తే అభిమానుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, ఇది తీవ్రమైన గందరగోళానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఆదివారం వరకైతే విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని వాదించింది.

వేడుకలు ఆదివారానికి వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదించారు. వేడి మీద వేడుకలు నిర్వహించకపోతే తమకు డ్యామేజ్‌ అవుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్సీబీ యాజమాన్యం వాదనతోనే ముందుకెళ్లింది.

ఆర్సీబీ టైటిల్‌ను గెలిచిన మరు క్షణం నుంచే బెంగళూరు వీధుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. జట్టు విజయోత్సవాలు జరుపుకుంటున్న అభిమానులు తెగ హడావుడి చేశారు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మానం జరుగుతుందని తెలియడంతో అభిమానులు భారీ సంఖ్యలో గుమికూడారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గుమికూడవద్దని పోలీసులు ముందే హెచ్చరించినా అభిమానులు వినలేదు. తొక్కిసలాట జరిగిన సమయంలో స్టేడియం చుట్టూ రెండు లక్షలకు పైగా జనం ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఆటగాళ్ల ఊరేగింపుకు ప్లాన్‌ చేసింది. అయితే తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలు వస్తాయని పోలీసులు వారించడంతో వెనక్కు తగ్గింది. తీరా చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్యాన కార్యక్రమాన్ని ప్లాన్‌ చేస్తే, అది చివరి​కి విషాదాంతమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement