
టీమిండియా వెటరన్ స్పిన్నర్ పియుశ్ చావ్లా ఇవాళ (జూన్ 6) క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్లలో సభ్యుడైన పియుశ్.. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాలీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
పియుశ్ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం సోషల్మీడియాలో ఓ ఆసక్తికర అంశం వైరలవుతుంది. పియుశ్ రిటైర్మెంట్ తర్వాత 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టు సభ్యుల్లో ఇంకొకరు మాత్రమే ఇంకా కెరీర్ను (వన్డే) కొనసాగిస్తున్నారు. అతనెవరో కాదు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, తాజా ఐపీఎల్ విన్నర్ విరాట్ కోహ్లి.

2011 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించగా.. పియుశ్ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లి ఒక్కడే మిగిలి ఉన్నాడు (రిటైర్ కాకుండా). ఓసారి నాటి వరల్డ్కప్ విన్నింగ్ భారత జట్టుపై ఓ లుక్కేద్దాం. నాడు టీమిండియా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఆ జట్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ కూడా ఉన్నాడు. సచిన్కు అదే చివరి వరల్డ్కప్.
సచిన్తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ధోని, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, పియుశ్ చావ్లా, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్ టీమిండియాలో ఉన్నారు. ఇవాల్టితో ఆ 15 మంది సభ్యుల్లో 14 మంది రిటైరైపోయి కోచింగ్, ఇతరత్రా బాధ్యతల్లో ఉండగా.. విరాట్ ఒక్కడే వన్డే కెరీర్ను కొనసాగిస్తున్నాడు. విరాట్ ఇటీవలే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
నాటి వరల్డ్కప్ ఫైనల్లో భారత్ శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, తమ రెండో వన్డే వరల్డ్కప్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. భారత్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి జగజ్జేతగా అవతరించింది. ధోని సిక్సర్ కొట్టి ఆ మ్యాచ్ను ముగించాడు. శ్రీలంక ఇన్నింగ్స్లో జయవర్దనే అజేయ సెంచరీతో కదంతొక్కగా.. భారత ఇన్నింగ్స్లో గంభీర్, ధోని 90ల్లో నిలిచారు.