
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ సల్మాన్ అలీ అఘాను నియమించేందుకు పీసీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాక్ టీ20 కెప్టెన్గా ఉన్న సల్మాన్.. కొత్తగా వన్డే, టెస్టు జట్టు పగ్గాలను కూడా చేపట్టనున్నట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం పాక్ టెస్టు కెప్టెన్గా షాన్ మసూద్, వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. వీరిద్దరూ కూడా పాక్ జట్టును విజయ పథంలో నడిపించలేకపోయారు. 2023 ఆఖరిలో పాక్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన షాన్ మసూద్.. దారుణంగా విఫలమయ్యాడు. మసూద్ సారథ్యంలో పాకిస్థాన్ 12 టెస్టు మ్యాచ్లు ఆడగా.. కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించి, తొమ్మిదింట ఓటమిపాలైంది.
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో సిరీస్ వైట్వాష్లకు గురైంది.అదేవిధంగా రిజ్వాన్ కూడా తన మార్క్ను చూపించలేకపోయాడు. అతడి సారథ్యంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లను పాక్ జట్టు సొంతం చేసుకున్నప్పటికి.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దారుణ ప్రదర్శన కనబరిచి లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.
ఈ కారణంగానే వారిద్దరిపై వేటు వేసి సల్మాన్ను మూడు ఫార్మాట్లలో తమ కెప్టెన్గా నియమించాలని పీసీబీ భావిస్తుందంట. కొత్త హెడ్కోచ్ మైక్ హెస్సన్ కూడా సల్మాన్ వైపు మొగ్గు చూపతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
"సల్మాన్ను ఆల్ఫార్మాట్ కెప్టెన్గా ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ, కొత్త హెడ్ కోచ్ హెస్సన్ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సల్మాన్ నాయకత్వ లక్షణాలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని సైతం ఆకట్టుకున్నాయి.
అందరూ ఒకే మాటపై ఉన్నారు అని పీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా సల్మాన్ ఈ ఏడాది మార్చిలో పాక్ టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అతడి సారథ్యంలో జింబాబ్వే, బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లను పాక్ జట్టు సొంతం చేసుకుంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ప్లేయర్కు గాయం