
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఆదివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడినట్లు తెలుస్తోంది. రెవ్స్పోర్ట్స్ ప్రకారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి ఎడమ చేతికి బలంగా తాకినట్లు సమాచారం. తీవ్రమైన నొప్పితో పంత్ విల్లవిల్లాడని, ఫిజియో మైదానంలోకి వచ్చి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడని సదరు వెబ్సైట్ పేర్కొంది.
ఆ తర్వాత ఫిజియో పంత్ తన చేతికి బ్యాండేజ్ వేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి పంత్ ప్రాక్టీస్కు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ గాయంపై బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా పంత్ గాయం తీవ్రమైనది అయితే భారత్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.
ఎందుకంటే భారత టెస్టు జట్టులో పంత్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు కొత్త వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఈ డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ చేపట్టాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.
అంతకంటే ముందు ఈ నెల 13న ఇండియా-ఎ జట్టుతో భారత సీనియర్ జట్టు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ ఆడనుంది. కాగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్మన్ గిల్ సారథ్యంలో యువ భారత జట్టు ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)
జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)
జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)
జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)
జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్)
చదవండి: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక నియామకం