టీ20 ప్రపంచకప్-2026 లీగ్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. కీలకమైన సూపర్-8లో మాత్రం తమ జోరును కొనసాగించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది.
సూర్యకుమార్ నాయకత్వంలోని భారత జట్టు బౌలింగ్లో కాస్త ఫర్వాలేదన్పించినప్పటికి బ్యాటింగ్లో మాత్రం దారుణంగా విఫలమైంది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీశాడు.
భారత బ్యాటర్లలో శివమే దూబే(42) ఒక్కడే రాణించాడు. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లోనే భారీ విజయం సాధిస్తేనే టీమిండియా సెమీస్ రేసులో ఉంటుంది. ఈ ఘోర ఓటమితో టీమిండియా రన్రేట్(-3.800) భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
"ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ అసలు రూపం బట్టబయలైంది. ఈ టోర్నీలో భారత్ ఛేజింగ్కు దిగడం ఇదే మొదటిసారి. లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ఒత్తిడి తట్టుకోలేక చిత్తైంది. ఛేజింగ్లో భారత్ తడబడుతుందని నాకు ముందే తెలుసు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాడు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది"అని జియో న్యూస్కు వచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ పేర్కొన్నాడు.
కాగా టోర్నీకి ముందే భారత్ సెమీఫైనల్ చేరడం కష్టమని అమీర్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ టోర్నీలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అట్టర్ ప్లాప్ అవుతాడని అమీర్ ఇటీవల చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే అభిషేక్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఇప్పుడు మ్యాచ్ ఫలితం కూడా అతడు అంచనా వేసినట్లే రావడం అతడు టౌక్ ఆఫ్ది టౌన్గా మారాడు. భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ అనంతరం అమీర్ జియో న్యూస్ చానల్లో జరిగిన చర్చలో పాల్గొన్నాడు. యాంకర్ అతడిని జ్యోతిష్యుడు అంటూ పరిచయం చేయగానే అమీర్ పగలబడి నవ్వుతూ “దేవుడా నన్న క్షమించు, నాకు ఏంటి ఇది” అంటూ స్పందించాడు.
దీంతో అతడికి భారత్ అభిమానులు గట్టిగా కౌంటరిస్తున్నారు. టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి సెమీస్కు కచ్చితంగా వస్తుందని పోస్టులు పెడుతున్నారు. కాగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో గురువారం జింబాబ్వేతో తలపడనుంది.


