దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానులకు ఇది బంపర్ బొనాంజా లాంటి వార్త. కింగ్ త్వరలో జరుగబోయే దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులగా ఈ విషయమై సందిగ్దత నెలకొని ఉండింది. కోహ్లి స్వయంగా తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని చెప్పడంతో అతడి అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.
టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి.. దేశవాలీ టోర్నీ ఆడనుండటం క్రికెట్ అభిమానులకు నిజంగా పండుగే. కోహ్లి తన సొంత దేశవాలీ జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీ ఆడేందుకు కోహ్లి సంసిద్దత వ్యక్తం చేసిన విషయాన్ని ఢిల్లీ క్రికెట్ ఆసోసియేషన్ చీఫ్ రోహన్ జైట్లీ ధృవీకరించారు.
ఈ విషయాన్ని ఆయన క్రిక్బజ్ మాధ్యమంగా వెల్లడిస్తూ.. అవును.. కోహ్లి విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న మాట వాస్తవమే. అయితే అతడెన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడన్న విషయం ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు జరుగుతుంది.
కాగా, జాతీయ జట్టు పరిగణలో ఉండాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక రాణించాల్సి ఉంటుందని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కోహ్లి ఈ నిర్ణయం 2027 ప్రపంచకప్ ఆడాలనుకున్న అతని బలమైన సంకల్పాన్ని సూచిస్తుంది.
కోహ్లి చివరిగా 2009-10 విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. ఈ టోర్నీలో అతను 14 మ్యాచ్లు ఆడి నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 819 పరుగులు చేశాడు. ఈ గణంకాలు చూస్తే చాలు ఈ టోర్నీలోనూ కింగ్ హవా ఎలా కొనసాగిందో చెప్పడానికి.
ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో కోహ్లి సూపర్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత కోహ్లి అత్యుత్తమ టచ్లో ఉన్నట్లు కనిపించాడు. చూడచక్కని డ్రైవ్లు, షాట్లు ఆడి అభిమానులకు అలరించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో కోహ్లి తన కెరీర్ అత్యున్నత స్థితిని గుర్తు చేశాడు.


