ఎన్నాళ్లకెన్నాళ్లకు దినేశ్‌ కార్తీక్‌..

KKR Set Target Of 165 Runs Against Kings Punjab - Sakshi

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 165 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శుబ్‌మన్‌ గిల్‌(57; 47 బంతుల్లో 5 ఫోర్లు),  దినేశ్‌ కార్తీక్‌(58; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను  రాహుల్‌ త్రిపాఠి, శుబ్‌మన్‌ గిల్‌లు ఆరంభించారు. కాగా, రాహుల్‌ త్రిపాఠి(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో త్రిపాఠిని షమీ బౌల్డ్‌ చేశాడు. అనంతరం నితీష్‌ రాణా(2) రనౌట్‌ అయ్యాడు. ఈ రనౌట్‌ అయ్యే క్రమంలో నాటకీయ  పరిణామాలు చోటుచేసుకున్నాయి.  అర్షదీప్‌ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతిని శుబ్‌మన్‌ గిల్‌ షార్ట్‌ ఫైన్‌లెగ్‌లోకి ఆడాడు. అయితే ఆ సమయంలో ఫీల్డర్‌ ఉన్నాడు. కానీ దాన్ని గ్రహించని నాన్‌స్టైకర్‌ నితీష్‌ రాణా స్టైకింగ్‌ ఎండ్‌ వైపు పరుగు తీసి అనవరసంగా వికెట్‌ సమర్పించుకున్నాడు.(నాన్‌స్టైకర్‌ పరుగే పరుగు.. ఫన్నీ రనౌట్‌)

ఆపై ఇయాన్‌ మోర్గాన్‌-గిల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.  వీరిద్దరూ 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత మోర్గాన్‌(24) ఔటయ్యాడు. ఆ తరుణంలో గిల్‌కు -దినేశ్‌ కార్తీక్‌ జత కలిశాడు. అయితే ఎటువంటి ఆశలు లేని కార్తీక్‌ మాత్రం ఈసారి మెరిశాడు. దినేశ్‌ కార్తీక్‌ బ్యాట్‌ నుంచి చూడచక్కని ఇన్నింగ్స్‌  వచ్చిం‍్ది. సొగసైన బౌండరీలతో అలరించాడు. ఈ జోడి 82 పరుగుల జోడించిన తర్వాత గిల్‌ ఔటయ్యాడు. దాంతో కేకేఆర్‌ తిరిగి తేరుకుంది. అటు తర్వాత కార్తీక్‌ అర్థ శతకం మార్కును చేరి బ్యాటింగ్‌లో సత్తాచాటి స్కోరు బోర్డును చక్కదిద్దాడు. దినేశ్‌ కార్తీక్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రసెల్‌(5) మరోసారి విఫలయ్యాడు. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌, రవిబిష్నోయ్‌లు తలో వికెట్‌ సాధించారు. ఆఖరి బంతికి కార్తీక్‌ రనౌట్‌ అయ్యాడు. ముగ్గురు కేకేఆర్‌ ఆటగాళ్లు రనౌట్‌ అయ్యారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top