
ఇంగ్లండ్ కౌంటీల్లో ఈ సీజన్లో ఆడుతున్న భారత ఆటగాళ్ల జాబితాలో మరో ప్లేయర్ చేరాడు. లెఫ్టార్మ్ పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ‘ఎసెక్స్’ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం అతను దాదాపు రెండు నెలల పాటు టీమ్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ మధ్య కాలంలో ఖలీల్ 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లతో పాటు 8 వన్డేలు
ఆడతాడు.
ఎసెక్స్ టీమ్ నాకౌట్ దశకు చేరితే మరో రెండు వన్డేలు అదనంగా ఆడే అవకాశం వస్తుంది. వైవిధ్యభరితమైన ఖలీల్ లెఫ్టార్మ్ బౌలింగ్ తమ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందని ఎసెక్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ క్రిస్ సిల్వర్వుడ్ వ్యాఖ్యానించారు.
రాజస్తాన్కు చెందిన 27 ఏళ్ల ఖలీల్ భారత్ తరఫున 11 వన్డేల్లో 15 వికెట్లు...18 టి20ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఆడిన 71 మ్యాచ్ల ద్వారా అతనికి మంచి గుర్తింపు లభించింది. 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 56 వికెట్లు తీసిన అనుభవం ఖలీల్కు ఉంది. ఇంగ్లండ్ కౌంటీల్లో ఇప్పటికే భారత ప్లేయర్లు ఇషాన్ కిషన్ (నాటింగ్హామ్షైర్), తిలక్ వర్మ (హాంప్షైర్), రుతురాజ్ గైక్వాడ్ (యార్క్షైర్), చహల్ (నార్తాంప్టన్షైర్) ఆడుతున్నారు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి భారత ప్లేయర్గా