శ్రీలంక-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 549 పరుగులు (డిక్లేర్) చేయగా.. వెస్డిండీస్ లంక స్కోర్కు ధీటుగా బదులిస్తూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.
ధీటుగా బదులిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్ ఇంకా 231 పరుగులు వెనుకపడే ఉంది. మూడో రోజు ఆటలో విండీస్ బ్యాటర్లు షాయ్ హోప్ (86), జస్టిన్ గ్రీవ్స్ (85) లంక బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అంతకుముందు ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (72) కూడా ఇంచుమించు ఇదే పని చేశాడు. మిగతా ప్లేయర్లలో బ్రాండన్ కింగ్ (17), ఆమీర్ జాంగూ (9) నిరాశపర్చగా.. కవెమ్ హాడ్జ్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య తలో 2 వికెట్లు తీశాడు.
అంతకుముందు శ్రీలంక తరఫున ఓపెనర్ లహీరు ఉదార (188) భారీ శతకంతో కదంతొక్కాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ సోనల్ దినుష (92) సెంచరీ చేజార్చుకున్నాడు. కమిందు మెండిస్ (84) కూడా సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఔట్ కాగా.. కుసాల్ మెండిస్ (69) అర్ద సెంచరీతో రాణించాడు.
మిగతా బ్యాటర్లలో ధనంజయ డిసిల్వ 33, నిషన్ మధుష్క 6, దినేశ్ చండీమల్ 1, మిలన్ రత్నాయకే 15, విజేసుందెర 14, ప్రభాత్ జయసూర్య 17 (నాటౌట్) పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, షమార్ జోసఫ్ తలో 2 వికెట్లు తీయగా.. అల్జరీ జోసఫ్, ఆండర్సన్ ఫిలిప్, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ ఛేస్, కవెమ్ హాడ్జ్ తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆతిథ్య వెస్టిండీస్ తొలి మ్యాచ్లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.


