
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ ఓటమి దిశగా సాగుతుంది. 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ మూడో రోజు ఆఖరి సెషన్లో నిప్పులు చెరిగాడు. నగరవ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి ఐర్లాండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. బ్లెస్సింగ్ ముజరబాని ఓ వికెట్ పడగొట్టాడు. నగరవ ధాటికి ఐర్లాండ్ టాపార్డర్ ఏకంగా ముగ్గురు (పీటర్ మూర్, కర్టిస్ క్యాంఫర్, హ్యారీ టెక్టార్) డకౌట్లయ్యారు.
కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ 4, పాల్ స్టిర్లింగ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. లొర్కాన్ టక్కర్ 9, ఆండీ మెక్ బ్రైన్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఐర్లాండ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే మరో 125 పరుగులు చేయల్సి ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలుండగా చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 210, రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులు చేసింది.