
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది.
ఈ సీజన్లో ఆ జట్టు మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లు గెలిచినా, ఓడినా రాయల్స్కు ఒరిగేది ఏమీ లేదు. అయితే ప్రత్యర్థి జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది.
ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ నిజాయితీగా తమ తప్పిదాలను ఒప్పుకున్నాడు. ఈ సీజన్లో చాలా పొరపాట్లు చేశామని అంగీకరించాడు. తప్పిదాలపై దృష్టి సారిస్తామని చెప్పాడు. తప్పులతో పాటు కొన్ని మంచి పనులు కూడా చేశామని అన్నాడు. తదుపరి మూడు మ్యాచ్ల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ముంబై ఇండియన్స్కు క్రెడిట్ ఇచ్చాడు. వారు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమని కొనియాడాడు. ఓవర్కు 10 పరుగుల చొప్పున రన్రేట్ మెయిన్టైన్ చేస్తూ చివర్లో చెలరేగారని అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ రోజు మాది కాదని అన్నాడు. పిచ్పై స్పందిస్తూ.. 190-200 ఛేజింగ్కు అనువైన స్కోర్ అని తెలిపాడు. ముంబై అదనపు పరుగులు సాధించినందుకు హార్దిక్, సూర్యకుమార్కు క్రెడిట్ ఇచ్చాడు. తమ ఆటతీరు మెరుగ్గా ఉండాల్సిందని ఒప్పుకున్నాడు.
ఈ సీజన్లో బ్యాటింగ్లో మంచి ఆరంభాలు లభించినా మిడిలార్డర్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయిందని తెలిపాడు. తాను, జురెల్ మిడిలార్డర్లో బాధ్యత తీసుకోవాల్సిందని అన్నాడు. ఈ రోజు వచ్చిన అవకాశం మరోసారి వస్తే తమ సత్తా చాటుతామని తెలిపాడు.
కాగా, నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత ముంబై బ్యాటర్లను కట్టడి చేయలేకపోయిన ఆ జట్టు.. ఆతర్వాత బ్యాటింగ్లో తొలి బంతి నుంచే చేతులెత్తేసింది.
గత మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించిన 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ ఈ మ్యాచ్లో డకౌటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాది జోష్గా కనిపించిన జైస్వాల్ అదే ఓవర్లో ఔటయ్యాడు. ముంబై బౌలర్లు చెలరేగడంతో రాణా, పరాగ్, జురెల్, హెట్మైర్ వికెట్లు కోల్పోయారు. మొత్తంగా ఈ మ్యాచ్లో రాయల్స్ తమ స్థాయి ఆటతీరు ప్రదర్శించలేక చిత్తుగా ఓడింది.