
Photo Courtesy: BCCI
ఐపీఎల్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల సెంచరీని పూర్తి చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో సీఎస్కే ఈ ల్యాండ్ మార్కును తాకింది. తద్వారా ఐపీఎల్లో 100 పరాజయాలు పూర్తి చేసుకున్న ఏడో జట్టుగా నిలిచింది. సీఎస్కేకు ముందు ఢిల్లీ (134), పంజాబ్ (133), ఆర్సీబీ (128), కేకేఆర్ (118), ముంబై ఇండియన్స్ (117), రాజస్థాన్ రాయల్స్ (108) 100 పరాజయాల మార్కును తాకాయి.
మధ్యలో రెండు సీజన్లు మినహా ఐపీఎల్ మొత్తంలో పాల్గొన్న సీఎస్కే ఇప్పటివరకు 242 మ్యాచ్లు ఆడి 139 విజయాలు, 100 పరాజయాలను ఎదుర్కొంది. ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో సీఎస్కే రెండో స్థానంలో ఉంది. ముంబై (142) టాప్లో ఉండగా.. సీఎస్కే (139), కేకేఆర్ (131), ఆర్సీబీ (123), ఢిల్లీ (114), రాజస్థాన్ (111), పంజాబ్ (110) వరుస స్థానాల్లో ఉన్నాయి.
కాగా, ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ గెలిచిన ఆ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
రాయల్స్ ఇన్నింగ్స్లో నితీశ్తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్ అహ్మద్ (4-0-38-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్), జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), ధోని (11 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) పోరాడినా లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాయల్స్ బౌలర్లలో హసరంగ (4-0-35-4), ఆర్చర్ (3-1-13-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్లో సీఎస్కే గెలుపుకు అవసరం కాగా.. సందీప్ శర్మ 13 పరుగులకే ఇచ్చి రాయల్స్కు ఈ సీజన్లో తొలి గెలుపును అందించాడు.