
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. వరుస ఓటములతో మరో మూడు మ్యాచ్లు మిగిలూండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమించింది. అయితే మిగిలిన మూడు మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తమ పరువు కాపాడుకోవాలని సీఎస్కే భావిస్తోంది.
సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో మే 7న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల అన్క్యాప్డ్ వికెట్ కీపర్-బ్యాటర్ వన్ష్ బేడీ చీలమండ గాయం కారణంగా మిగిలిన సీజన్కు దూరమయ్యాడు.
అతడి స్దానంలో బరోడా బ్యాటర్ ఉర్విల్ పటేల్ను చెన్నై తమ జట్టులోకి తీసుకుంది. "ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్లకు వన్ష్ బేడీ దూరమయ్యాడు. అతడి స్దానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఉర్విల్ పటేల్తో ఒప్పందం కుదుర్చుకుంది" అని ఐపీఎల్ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.
26 ఏళ్ల ఉర్విల్ పటేల్కు టీ20 క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి పటేల్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు. అదే టోర్నీలో ఉత్తరాఖండ్పై కూడా 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఉర్విల్ పటేల్తో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఉర్విల్.. 47 టీ20 మ్యాచ్లు ఆడి 170 స్ట్రైక్ రేట్తో 1162 పరుగులు చేశాడు.