
ఈ నెల 24 నుంచి ఇంగ్లండ్తో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్కు ముందు భారత అండర్-19 జట్టుకు గాయాల బెడద పట్టుకుంది. ఈ సిరీస్కు ఎంపికైన ఇద్దరు కీలక ఆటగాళ్లు (ఆదిత్య రాణా, ఖిలన్ పటేల్) బీసీసీఐ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో గాయపడ్డారు.
ఆదిత్య వెన్ను భాగంలో స్ట్రెస్ ఫ్రాక్చర్కు గురి కాగా.. ఖిలన్ పటేల్ కుడి కాలి గాయానికి గురయ్యాడు. వీరిద్దరు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లరని బీసీసీఐ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరికి ప్రత్యామ్నాయంగా దీపేశ్, నమన్ పుష్పక్లకు ఎంపిక చేసింది. దీపేశ్, పుష్పక్ ఇదివరకే ప్రకటించిన భారత జట్టు స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో ఉన్నారు.
కాగా, ఇంగ్లండ్తో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత కెప్టెన్గా ఐపీఎల్ హీరో ఆయుశ్ మాత్రే (సీఎస్కే) ఎంపికయ్యాడు. ఈ జట్టులో మరో ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్లలో వైభవ్.. మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్లు ప్రారంభిస్తాడు.
వైభవ్ తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో 90 బంతుల్లో 190 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఓ 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్, 5 వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు (టెస్ట్లు) ఆడుతుంది.
ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & వికెట్కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, యుద్దజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఎనాన్, దీపేశ్, అన్మోల్జీత్ సింగ్
స్టాండ్బై ప్లేయర్స్: వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్కీపర్)
ఇంగ్లండ్ పర్యటనలో భారత అండర్-19 జట్టు షెడ్యూల్..
జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ (లోగ్బరో యూనివర్శిటీ)
జూన్ 27- తొలి వన్డే (హోవ్)
జూన్ 30- రెండో వన్డే (నార్తంప్టన్)
జులై 2- మూడో వన్డే (నార్తంప్టన్)
జులై 5- నాలుగో వన్డే (వార్సెస్టర్)
జులై 7- ఐదో వన్డే (వార్సెస్టర్)
జులై 12-15: తొలి మల్టీ డే మ్యాచ్ (బెకెన్హమ్)
జులై 20-23: రెండో మల్టీ డే మ్యాచ్ (చెమ్స్ఫోర్డ్)